వికారాబాద్, మే 14, (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వికారాబాద్ జిల్లాలో మూడో రోజు శుక్రవారం కట్టుదిట్టంగా జరిగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపు వేళల్లోనే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు సమకూర్చుకున్నారు. రంజాన్, బసవేశ్వర జయంతి వేడుకలను ఆ సమయంలోనే నిర్వహించారు. లాక్ డౌన్కు ముందే ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య పర్యటించారు. పెండ్లిళ్ల సీజన్ కావడంతో జనం జిల్లా, మండల కేంద్రాలకు భారీగా తరలివచ్చి అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు. 10 గంటల తర్వాత స్వచ్ఛందంగా ఇండ్లకు వెళ్లిపోయారు. వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
జిల్లా ఎస్పీ నారాయణ, డీఎస్పీలు సంజీవరావు, లక్ష్మీనారాయణ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్సైలు ఎప్పటికప్పుడు లాక్డౌన్ను పర్యవేక్షించారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల లాక్ డౌన్ ఉల్లఘించిన ప్రాంతాల్లో పోలీసులు నేరుగా జరిమానాలు విధించారు. మరికొన్ని చోట్ల ఈ-చలాన్లు వేశారు. పరిగి సర్కిల్లో 3 రోజుల లాక్డౌన్లో నిబంధనలు అతిక్రమించిన వాహనాదారులపై 250 కేసులు నమోదు చేయగా..75 వాహనాలు సీజ్ చేశారు. కొడంగల్ సర్కిల్ పరిధిలో 3 రోజుల్లో 12 వాహనాలు సీజ్ చేశారు. ఈ చలాన్ చెల్లింపులతో వాహనాలను విడుదల చేశారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ తదితర నియోజక వర్గాల్లో జనం ఇండ్లకే పరిమితమయ్యారు.
రైతు బజార్, పోస్టాఫీస్ల వద్ద రద్దీ..
జిల్లాలోని కూరగాయల మార్కెట్లు, పోస్టాఫీసుల వద్ద జనం రద్దీ కనిపించింది. కూరగాయల వాహనాలు పలు ప్రాంతాలకు వచ్చి విక్రయాలు జరిపారు. పోస్టాఫీస్ల వద్ద పింఛన్ల కోసం లబ్ధిదారులు గుంపులుగా కూర్చున్నారు. ఉదయం నాలుగు గంటలు విపరితమైన రద్దీ కనిపించింది.