హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బసవేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, వేడుకలు నిర్వహించాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బసవేశ్వర్ జయంతి సందర్భంగా వీరశైవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల మధ్య అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలానాధక్షుడిగా పేరొందారని గుర్తుచేశారు. వీరశైవ లింగాయత్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని సీఎం తెలిపారు. కాగా, బసవేశ్వర్ జయంతి వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.