గ్రామ రూపురేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’
ఇంటింటికీ శుద్ధమైన మిషన్ భగీరథ నీళ్లు
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గోళ్లపాడు గ్రామ రూపురేఖలు మారిపోయాయి. డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తుండడం, వారానికోసారి బ్లీచింగ్ చల్లిస్తుండడం, నిత్యం పారిశుధ్య పనులు చేపడుతుండడం వంటి చర్యలతో గ్రామం చూడచక్కని విధంగా మారింది. దీంతో సీజనల్ వ్యాధుల జాడ కనుమరుగైంది. పాడుపడ్డ బావుల పూడ్చివేత, శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత, పిచ్చి మొక్కలు తొలగింపు, మురుగు కాల్వలో చెత్త తీసివేత వంటి కార్యక్రమాలతో ఆ గ్రామం స్వచ్ఛతకు చిరునామాగా మారింది. మిషన్ భగీరథతో రోజూ రెండు పూటలా పుష్కలంగా శుద్ధమైన నీళ్లు సరఫరా అవుతున్నాయి. పల్లెపగ్రతితో గ్రామం నందనవనమైంది. అంతర్గత వీధులన్నీ సీసీ రోడ్లయ్యాయి. రైతువేదిక, పల్లెప్రకృతి వనం, నూతన పంచాయతీ కార్యాలయం ఒకే చోట ఉండడంతో గ్రామస్తులకు సౌకర్యంగా ఉంది. పంచాయతీ ట్రాక్టర్ వీధులన్నీ తిరిగి ప్రతి ఇంటి నుంచీ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. పారిశుధ్య సిబ్బంది అక్కడ తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేస్తున్నారు.
5,600 మొక్కల పంపిణీ..
గ్రామ పంచాయతీలో రోడ్డుకు ఇరువైపులా 500 మొక్కలు నాటారు. వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. హరితహారంలో నాటిన మొక్కలు 95 శాతం బతికేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి 8 మొక్కలు చొప్పున 5600 మొక్కలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీల్లో రెండు పల్లెప్రకృతి వనాలను ఒక్కొక్కటీ అర ఎకరం స్థలంలో నిర్మించారు. గొళ్లపాడులో ఒకటి, ఊటవాగుతండాలో ఒకటి ఏర్పాటు చేశారు. ఊటవాగు తండాలోని పల్లె ప్రకృతి వనంలో రెండువేల మొక్కలు పెంచుతున్నారు. ఆఖరు మజిలీకి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన వైకుంఠధామం నిర్మాణం మాత్రం నత్తడకన కొనసాగుతోంది.