పెంపుడు కుక్కలు కొంటానని..
ఆన్లైన్ మోసానికి పాల్పడ్డ యువకుడు
బాధితురాలి ఫిర్యాదు.. కేసు నమోదు
సికింద్రాబాద్, మే 2: పెంపుడు కుక్కలను కొంటానని ఆన్లైన్ మోసానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నామాలగుండు శ్రీదేవి నర్సింగ్ హోం వద్ద అక్వెరియం నిర్వహించే పసుపులేటి నవీన్ భార్య కీర్తి పెట్స్ వ్యాపారం చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం 25 ఏండ్లున్న గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తనకు అర్జంట్గా రెండు పెంపుడు కుక్కలు కావాలని, రూ. 25 వేల విలువజేసే జాతి కుక్కలను తీసుకున్నాడు.
నగదును గూగుల్పే ద్వారా చెల్లిస్తానని చెప్పి కీర్తి ఫోన్కు పంపాడు. ఆమె ఫోన్లోనే నగదు జమైనట్లు సంక్షిప్త సందేశం చూపించి, ఆ వెంటనే ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. తరువాత మెస్సేజ్ చూసుకోగా నగదు జమకాలేదు. గూగుల్పేలో ఉన్న నంబర్కు ఫోన్ చేస్తే నకిలీ యాప్ ద్వారా వచ్చిన సంక్షిప్త సందేశంగా తేలింది. ఆదివారం చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.