2వ డివిజన్లో రూ.76 కోట్లతో అభివృద్ధి పనులు
మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ కల్పన
భీమారం,ఏప్రిల్ 27 : ప్రజలు ఆదరించి, ఓటు వేస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ కల్పనా సింగ్లాల్ అన్నారు. మంగళవారం వంగపహాడ్, రెడ్డిపురం, గుండ్లసింగారం, పెగడపల్లి, ఇందిరమ్మ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గతంలో డివిజన్లో రూ.76 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. వంగపహాడ్, గుండ్లసింగారంలో సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ కల్పనాసింగ్లాల్ మాట్లాడుతూ గతంలో తాను చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించాలని కోరారు. వందేళ్లుగా అభివృద్ధికి నోచుకోని వంగపహాడ్, గుండ్లసింగారం, పెగడపల్లి గ్రామాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు..
వంగపహాడ్లో గిరిజనులపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వంగపహాడ్కు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ పార్టీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల జనాభా ప్రకారం 9.8 శాతం రిజర్వేషన్ కల్పించకుండా వారికి అన్యాయం చేస్తోందన్నారు. ఇకపై గిరిజనులపై అనుచితంగా ప్రవర్తించినా, మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. రూ.76 కోట్లతో బానోత్ కల్పన వంగపహాడ్ గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆమెకే ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, పర్వతగిరి జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మేరుగు రాజేశ్గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గండు అశోక్ యాదవ్, నాయకులు జంగా కుమార్యాదవ్, స్వరూప, దోమ కుమార్, బొమ్మగాని వెంకటేశ్ గౌడ్, మంద భాస్కర్, ముస్కు దేవేందర్ పాల్గొన్నారు.