సంస్థ పేరు చెప్పి మోసగిస్తే చర్యలు
గోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటుకు సన్నాహాలు
అవినీతిపై ఫోన్ కాల్, ఈ- మెయిల్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
శ్రీరాంపూర్, ఏప్రిల్ 26 : సింగరేణిని ప్రగతిబాటలో నడిపిస్తున్న సీఎండీ శ్రీధర్, అందులో జరిగే అక్రమాలపైనా దృష్టి సారించారు. సంస్థ పేరు చెప్పి అవినీతికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఉద్యోగాలిప్పి స్తామంటూ మోసగించే వారిని పట్టుకునేం దుకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా ఫిర్యాదు చేసేందుకు అధికారులు 94911 44104, 94911 45027 నంబర్లతో పాటు vig@scclmines.com మెయిల్ను అందుబాటులోకి తెచ్చారు.
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికుల సంక్షేమంపై నిత్యం దృష్టి సారిస్తూ అధికారులకు, ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తూ సంస్థను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుపుతున్న సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. సింగరేణి పేరు చెప్పి కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులను మోసగించే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం సింగరేణి పారదర్శకంగా అందిస్తున్న ప్రయోజనాలను పొందడంలో మోసగాళ్ల దోపిడీకి గురికాకుండా చూసేందుకు విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్ట పరచాలని నిర్ణయించారు. సింగరేణి ఉద్యోగుల్లో దాదా పు 50 శాతం కన్నా ఎక్కువ మంది పని చేస్తున్న రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా విజిలెన్స్ విభాగాన్ని గోదావరిఖనిలో ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కార్మికులను మోసగిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన పలువురిని ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు.
నకిలీ నియామక పత్రాలతో మోసం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ సింగరేణిలో కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం దాదాపు 5 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటనలు ఇచ్చారు. ఇవే కాకుండా అనేక ఇతర సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. సింగరేణిలో మెజార్టీ ఉద్యోగులు నిరక్షరాస్యులు కావడంతో కొందరు మోసగాళ్లు వారి అమయాకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని, వారసులకు ఉద్యోగాలు పెట్టిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసగిస్తున్నారు. ఇటీవల మోసగాళ్లు ఒక అడుగు ముందుకేసి సింగరేణి సంస్థలో ఉద్యోగానికి ఎంపికైనట్లుగా కొందరికి నకిలీ నియామక పత్రాలు సృష్టించి అందజేశారు. నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులను మోసగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని యాజమాన్యం నిర్ణయించింది. నిరుద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పకడ్బందీగా నియామక పరీక్షలు..
సింగరేణిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అత్యంత గోప్యంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం, దానిని రూపొందించే నిపుణులను పరీక్ష పూర్తయ్యే వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేని చోట ఉంచుతారు. ఇక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తే ట్యాంపరింగ్కు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పరీక్ష జరిగిన రోజే రాత్రి 9 గంటల తర్వాత సింరేణి వెబ్సైట్లో ఫలితాలు పొందపరుస్తారు. దేశంలో మరే పోటీ పరీక్షలోనూ పరీక్ష జరిగిన రోజు ఫలితాలు ఇచ్చే పద్ధతి లేదు. ఇలా సింగరేణి యాజమాన్యం పకడ్బందీగా మెడికల్ అన్ఫిట్ ప్రక్రియను చేస్తున్న విషయంపై, ఉద్యోగ నియామక ప్రక్రియ చాలా కట్టుదిట్టంగా చేస్తున్న విషయంపై అవగాహన లేని ఉద్యోగులు, నిరుద్యోగులు వంచకుల వలలో చిక్కుకొని మోసపోతున్నారు.
‘విజిలెన్స్’తో మోసగాళ్లకు చెక్
సింగరేణిలో ఇటీవల ఫిట్టర్ ట్రైయినీ, ఎలక్ట్రీషియన్ ట్రైయినీ, వెల్డర్ ట్రైయినీ, టర్నర్ ట్రైయి నీ,మెషినిస్టు, మౌల్డర్, జూనియర్ స్టాఫ్ నర్సు తదితర వందలాది పోస్టులకు ప్రకటనలు వచ్చా యి. ప్రతి నెలలోనూ మెడికల్ బోర్డులు నిర్వహి స్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అన్ఫిట్ చేస్తున్నారు. అర్హులైన వారి వారసులకు కారుణ్య నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో, కారుణ్య నియామకాల్లో మెడికల్ బోర్డులో ఉద్యోగాల్లోనూ సింగరేణి యాజమాన్యం పూర్తి పారదర్శకతను పాటిస్తున్నది. కొందరి వైఖరితో అమాయకులు మోసపోవడం, దీంతో యాజమాన్యం అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో మోసగాళ్ల ఆటకట్టించేందుకు యాజమాన్యం విజిలెన్స్ విభాగాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నది. అవినీతిపై, మోసగాళ్ల సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా వారి వివరాలను విజిలెన్స్కు ఇస్తే తక్షణమే చర్యలు ఉంటాయన్న సంకేతాన్ని ఉద్యోగులకు తెలిసేలా ఏటా విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నది. అవినీతి రహిత సింగరేణి కోసం వారిని జాగృత పరుస్తున్నది. అలాగే ఉద్యోగ నియామక ప్రక్రియలో, మెడికల్ బోర్డులో దళారులుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన పలువురిపై శాఖాపరమైన విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ అవినీతికి పాల్పడే వారికి గట్టి సంకేతాలిచ్చింది.