మున్సిపల్ ఎన్నికలకు గట్టి బందోబస్తు
ఎన్నికల నియమావళి పాటించాలి
అభ్యర్థులకు సీపీ జోయల్ డెవిస్ సూచనలు
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 23 : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్, గజ్వేల్ 12వ వార్డులో ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థులకు ఆయన పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు కొవిడ్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వెంట శానిటైజర్ తీసుకెళ్లాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువ మందితో ర్యాలీలు తీయవద్దన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. గజ్వేల్, సిద్దిపేట ఏసీపీల అనుమతి తప్పనిసరి తీసుకొని సభలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉందన్నారు.
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. ఒక అభ్యర్థికి ఒకే ప్రదేశంలో సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. ఇంటింటి ప్రచారంలో మైక్లను వినియోగించకూడదన్నారు. సభలు, సమావేశాలకు మాత్రమే మైక్లను వాడాలని సూచించారు. గొడవలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని తెలిపారు. భయబ్రాంతులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులను, మద్యం ఆశ చూపి ఓటు వేయాలని ప్రలోభపెడితే 9490617009, 7901100100 నంబర్లకు, లేదా డయల్ యువర్ 100కు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. నేరపూరితమైన చర్యలకు దిగిన, ఎన్నికల నియమావళి అతిక్రమించిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరోనా వ్యాధి విస్తృతంగా విస్తరిస్తున్నదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకోవాలన్నారు. ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని కోరారు.