లండన్: భారత్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి భారత్ను రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ సోమవారం తెలిపారు. యూకే, ఐరిస్ దేశీయులు తప్ప భారత్ నుంచి ప్రయాణికులపై నిషేధం విధించినట్లు చెప్పారు.
బ్రిటన్ జాతీయులు, విదేశీయులు రెడ్ లిస్ట్ దేశాల నుంచి తిరిగి వస్తే ప్రభుత్వం అనుమతించిన క్వారంటైన్ హోటల్స్లో సొంత ఖర్చులతో పది రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని మాట్ వెల్లడించారు. భారత్లో కరోనా కేసుల పెరుగుదల, వందల సంఖ్యలో వేరియంట్ల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చాల్సి వచ్చిందని పార్లమెంట్కు తెలిపారు. ఈ జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి.