నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తుది పోలింగ్ శాతాన్ని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. మొత్తం 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగగా 86.18శాతంగా నమోదైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించు కోవడం వల్లే పోలింగ్ శాతం పెరిగింది.
కొవిడ్ జాగ్రత్తలతో..
పోలింగ్పై కొవిడ్ ప్రభావం ఉంటుందని మొదట్లో భావించినా.. అధికారులు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లు, శానిటైజర్లను వినియోగించడంతో ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు కదిలారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ గ్లౌజ్లను ఓటర్లకు అందజేశారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతోనే భారీగా పోలింగ్ నమోదైనట్లు భావిస్తున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 86.44శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 79.63శాతం మాత్రమే నమోదైంది. అప్పటితో పోలిస్తే దాదాపు 17వేల పైచిలుకు ఓటర్ల సంఖ్య పెరిగినా పోలింగ్ శాతం భారీగా పెరుగడం శుభ పరిణామం.
మాడ్గులపల్లిలో అత్యధికం
మాడ్గులపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మండలంలో 12పోలింగ్ కేంద్రాలు ఉండగా కొన్నింటిలో 94 నుంచి 95శాతం వరకు పోలింగ్ జరిగింది. మొత్తంమీద 93.03శాతంతో మాడ్గులపల్లి అగ్రస్థానంలో ఉంది. 77.55 శాతంతో పెద్దవూర మండలం చివరి స్థానంలో నిలిచింది. ఈ మండలంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో 85శాతానికి పైగా నమోదు కాగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అతి తక్కువగా 52.29 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. అనుములలో 85.85 శాతం, గుర్రంపోడులో 89.66శాతం, నిడమనూరులో 88.87శాతం, తిరుమలగిరిసాగర్లో 87.74 శాతం, త్రిపురారంలో 88.73శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,20,206 ఓట్లకు గాను 1,89,782 పోలయ్యాయి.
గాసీరాంతండాలో ఎక్కువ
పోలింగ్ కేంద్రాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా గుర్రంపోడు మండలంలోని గాసీరాంతండా(జూనూతల)లోని 33వ పోలింగ్ కేంద్రంలో 780 మంది ఓటర్లకు గాను 751 మంది ఓటు వేయగా 96.28శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పాటు చాలా పోలింగ్ కేంద్రాల్లో 95శాతం వరకు పోలింగ్ జరిగింది. అతి తక్కువ పోలింగ్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని విజయపురి నార్త్ పైలాన్ కాలనీలోని 107 పోలింగ్ కేంద్రంలో 38.52 శాతమే నమోదైంది. ఇక్కడ 950 మంది ఓటర్లు ఉండగా 366 మంది ఓటు వేశారు. అభ్యర్థుల హోరాహోరీ ప్రచారంతో పాటు ప్రతి ఓటరును అనేకసార్లు కలిశారు. దీంతో ఎక్కువ మంది ఓట వేసేందుకు ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తుంది.
అంచనాల్లో పార్టీలు
పోలింగ్ ముగిశాక అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే అంచనాల్లో తలమునకలవుతున్నారు. నెల రోజుల పాటు సాగించిన ప్రచారానికి ఏ మేరకు ఫలితం దక్కనుందనే దానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఇన్చార్జీలుగా పనిచేసిన వారు తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఓటర్ల వారీగా లెక్కలు తీసే పనిలో కనిపించారు. ఆదివారం ఆసాంతం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు, శ్రేణులు పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కల్లో మునిగినట్లు సమాచారం. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా మంచి మెజార్టీతో విజయం తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి నినాదంపై ప్రజలు నమ్మకం ఉంచి ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తాము ధీటైన పోటీ ఇచ్చామని, తమకూ గెలుపు అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కేవలం అభ్యర్థి సామాజికవర్గానికి చెందిన ఓట్లపై ఆధారపడి ఓటింగ్ శాతం పెరుగుతుందనే అంచనాల్లో ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా వచ్చే నెల 2వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడక తప్పదు.
అందరికీ ధన్యవాదాలు : టీఆర్ఎస్
నెల రోజులుగా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇతరులకు టీఆర్ఎస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ఇన్నాళ్లు అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయడంలో పార్టీ శ్రేణులు సఫలమయ్యాయని తెలిపారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలోనూ ప్రతి ఒక్కరూ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. చిన్నచిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా అందరి సమష్టి కృషితో ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచి కారు గుర్తుకు ఓటేసిన ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మరో ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ పట్ల అభిమానం చూపించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ స్పందిస్తూ తన గెలుపు కోసం కృషి చేసిన వారికి, తనకు ఓటేసిన ప్రజలకూ ధన్యావాదాలు తెలిపారు.