నీటి సంరక్షణ బాధ్యతగా భావించాలి
ఇంకుడు గుంతల ద్వారా ఒడిసిపట్టాలి
పిల్లలకు చిన్ననాటి నుంచే పొదుపు పాఠాలు నేర్పాలి
నీటి బొట్టు..ఒడిసి పట్టు.. జలం..జీవం, నీటిని సంరక్షిద్దాం..భావితరాలకు అందిద్దాం..నీటి కష్టాలను నివారిద్దాం..వంటి నినాదాలను తరుచూ వింటుంటాం. నీటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియనది కాదు. అయినా కొందరు నీటిని తెలియకుండానే వృథా చేస్తుంటారు. వృథాపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఐక్యరాజ్యసమితి 1992 మార్చి 22 నుంచి ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహిస్తున్నది. తూచ తప్పకుండా అన్ని దేశాల్లో ప్రతియేటా మార్చి 22న ప్రపంచ నీటి పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ నీటి సంరక్షణను 90శాతం మంది విస్మరిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నీటి ప్రాముఖ్యతను గుర్తించి అనేక తాగు,సాగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతోపాటు రెండు మూడేండ్లలోనే అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేస్తూ సు‘జల’ తెలంగాణగా మార్చుతోంది. నీటి పొదుపుపై జలమండలి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
గ్రేటర్వ్యాప్తంగా జలమండలి సరఫరా చేస్తున్న మొత్తం నీటిలో వ్యక్తిగత అవసరాల కోసం 33.30శాతం వినియోగిస్తుండగా, టాయిలెట్స్ కోసం 25.01శాతం, బట్టలు ఉతికేందుకు 14 శాతం, తాగునీటి అవసరాలకు కేవలం 13.10 శాతం, పాత్రలు కడిగేందుకు 7.70శాతం, గార్డెనింగ్ కొరకు 6.10శాతం, వంట అవసరాలకు 0.09శాతం, వాహనాలు శుభ్రం చేసేందుకు 0.70శాతం నీటిని వినియోగిస్తున్నట్లు జలమండలి లెక్క కట్టింది. కొన్నిండ్లలో కిచెన్, బాత్రూంలలో నిత్యం ఒక్కొక్క చుక్క లీక్ అవుతున్నా..ఒకే చుక్క కదా అని వదిలేస్తారు. కానీ ప్రతి సెకన్కు ఒక చుక్క నీరు లీకు అవుతుందంటే ఒక గంటకు సుమారు 1.37 లీటర్లు, రోజుకు 32.19 లీటర్లు, ఏడాదికి సుమారు 12,015 లీటర్ల నీరు అంటే దాదాపు 2700 గ్యాలన్లు వృథావుతుందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.
జంటనగరాల్లో అక్రమ బోర్ల ద్వారా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తుండడంతో నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే భావి అవసరాలకు నీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కుల కారణంగా విలువైన నీటికి రక్షణ లేకుండా పోతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణగా నీటిని వినియోగించుకోవడంతోపాటు వృథాను అరికట్టకుంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
నీటి పొదుపుపై జలమండలి ప్రతియేటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ప్రధానంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక వాలంటీర్లతో కలిసి జల నాయకత్వం-నీటి సంరక్షణ (వాక్) వంటి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు నీటి పొదుపుపై అనేక సదస్సులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో ‘ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ ప్రతిష్టాత్మక ఐడబ్ల్యూఏ డెవలప్మెంట్ అవార్డును జలమండలి అందుకున్నది. వాక్ కార్యక్రమంలో భాగంగా నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగం, బోర్లు రీచార్జ్ చేయడం వంటి కార్యక్రమాల అమలుతో ఈ అవార్డు లభించినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తి 162 ఎల్పీసీడీల నీళ్లు వాడాలి. కానీ ఇందుకు విరుద్ధంగా దేశంలోని అనేక నగరాల్లో 90 ఎల్సీసీడీల నీరు కూడా అందించలేని పరిస్థితి ఉంది. గతంలో మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి రైలుద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుస్థితులు మనవద్ద రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నగర తాగునీటి అవసరాలు తీర్చుతున్నది. నగరానికి 186 కి.మీ దూరంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ (గోదావరి), 110 కి.మీ దూరంలో ఉన్న నాగార్జునసాగర్ (కృష్ణా నది) నుంచి నీటిని తరలిస్తూ దాహార్తి తీర్చుతున్నది.
రహదారులపై ఎక్కడైనా మంచినీటి వృథా జరిగితే తక్షణం జలమండలి టోల్ఫ్రీ నెంబర్ 155313కు సమాచారం ఇవ్వాలి. పబ్లిక్ నల్లాల నుంచి వృథాగా నీరు పోతుంటే వెంటనే నల్లాను బంద్ చేయాలి. కాలనీలోకి ట్యాంకర్ వచ్చినప్పుడు వరుసగా నిలబడి నీటిని పట్టుకోవాలి. ఒకేసారి గుమిగూడి తోపులాట జరిగితే నీరు వృథా అవుతుంది. రైల్వేస్టేషన్లు, బస్టాపుల్లో ట్యాపులను తిప్పి వదిలేయవద్దు. అలాంటివి కనిపిస్తే వెంటనే కట్టేయాలి. పిల్లలకు చిన్ననాటి నుంచే నీటిని పొదుపుగా వాడడం నేర్పించాలి. ప్రతి ఇల్లు లేదా కార్యాలయానికి వాన నీటిని నిల్వ చేసే గుంతలు (పెర్కొలేషన్ పిట్స్) నిర్మించడం మరువద్దు.