రాజమౌళితో సినిమా అనేది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కనే కల. దానికోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడడానికి అయిన వాళ్లు సిద్ధంగానే ఉంటారు. అలాగే ఒక సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు రాజమౌళికి ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉంటారు. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబుకు ఆ అవకాశం రాలేదు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా రాజమౌళి, మహేష్ సినిమా చేయలేకపోయారు. దాదాపు ఆరేళ్ల కింద ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఇద్దరూ బిజీగా ఉండడంతో మహేష్, రాజమౌళి సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాపై సీరియస్ గా ఉన్నాడు రాజమౌళి.
ఖచ్చితంగా మహేష్ బాబుతో కమిట్మెంట్ పూర్తి చేయాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఈ మేరకు రాజమౌళి నుంచి సూపర్ స్టార్ కు ఒక సూచన కూడా వచ్చిందని తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ తో సినిమా చేయబోతున్నాడు దర్శక ధీరుడు. అందుకే ఈయనతో సినిమా కోసం తన వర్కింగ్ స్టైల్ మార్చుకుంటున్నాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా అంటే కనీసం 2,3 ఏళ్లు పడుతుంది. అందుకే ఆయన సినిమా కంటే ముందు రెండు సినిమాలు వేగంగా పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అన్ని జాగ్రత్తల మధ్య హైదరాబాద్ లోనే జరుగుతుంది.
ఈ సినిమాను ముందు సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా.. ఇప్పుడు మనసు మార్చుకుని మూడు నెలల ముందుగానే తీసుకువస్తున్నారు. అదే విధంగా సెప్టెంబర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలుపెట్టి 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. జక్కన్నతో సినిమా అంటే ఎలాగు లేట్ అవుతుంది కాబట్టి ఆలోపు రెండు సినిమాలు విడుదల చేస్తే అభిమానులకు కూడా గ్యాప్ ఎక్కువ వచ్చిన ఫీలింగ్ ఉండదని మహేష్ ఆలోచన. ఏదేమైనా కూడా రాజమౌళి కోసం తన వర్కింగ్ స్టైల్ లో వేగం పెంచాడు సూపర్ స్టార్.