న్యూఢిల్లీ : ఐదు అసెంబ్లీలకు, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున మద్యం, నగదు స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు పట్టుకున్న మద్యం, నగదు విలువ రికార్డు స్థాయిలో రూ.వెయ్యి కోట్లు దాటింది. ఇది 2016 కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తమిళనాడులో గరిష్ఠంగా రూ.446.28 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఆ తర్వాత బెంగాల్లో రూ.300.11 కోట్లు పట్టుకున్నట్లు చెప్పింది.
ఇక్కడ ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుతం నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. అసోం, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరుగనుంది. మెరుగైన సంసిద్ధత, బహుముఖ వ్యూహంతో రికార్డు స్థాయిలో మద్యం, నగదు పట్టుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎప్పటికప్పుడు కమిషన్ వివిధ స్థాయిల్లో సమగ్ర సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల్లోని ఆదాయపు పన్ను శాఖ, కస్టమ్స్, జీఎస్టీ డైరెక్టరేట్లు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) బృందాలు సేవలందించాయి.
ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు.. తమిళనాడులో 446.28 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.300.11 కోట్లు (ఇప్పటివరకు), అసోం రూ.122.35 కోట్లు, కేరళ రూ.84.91 కోట్లు, పుదుచ్చేరిలో రూ.36.95 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఉప ఎన్నికల జరుగుతున్న నియోజకవర్గాల్లో రూ.10.84 కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మొత్తం విలువ రూ.1001.44 కోట్లు కాగా.. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో రూ.225.77 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.