అమరావతి:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు బాబూ. పాచి పనులు కోసం పోతున్నారంటూ కష్టజీవుల్ని హేళన చేశావు. ప్రత్యేక హోదాపై జగన్ గారిపై పడి ఏడుస్తున్నావుగానీ, కేంద్రాన్ని ఒక్క మాటనే దమ్ములేని పిరికిపందవు. హోదాకి సమాధికట్టిందే నువ్వు. హోదా కోసం వైసీపీ పోరాడంది ఎప్పుడు?’ అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘కొటియా గ్రామాలన్నీ ఆంధ్రాలోనే ఉంటాం ఒడిశా వద్దు మొర్రో అంటున్నాయి. సీఎం జగన్ గారి సంక్షేమ అభివృద్దికి ఇదే సాక్ష్యం. వైఎస్స్సార్ తర్వాత ఆ గిరిజన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు జగన్ గారే. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం వల్ల ఆంధ్ర స్కూల్స్ లోనే వారి పిల్లల్ని చేర్పిస్తున్నారని’ ఆయన వ్యాఖ్యానించారు.
‘కూన అనే కుహనా నాయకుడేమో దౌర్జన్యాలు చేసి పరారవుతుంటాడు. ఆడో, మగో తెలియని మరొకరేమో సీఎంగారిపై బురద జల్లడానికి నకిలీ వీడియోలు సృష్టిస్తుంటాడు. ఇద్దరికీ గత ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా తీరు మార్చుకోలేదు. యథా అధ్యక్ష – తథా నాయక అన్నట్లు టీడీపీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారని’ విజయసాయిరెడ్డి విమర్శించారు.