తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 13న ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు తెలిపారు.
సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, స్వామివారి మూలవిరాట్టును శ్వేతవస్త్రంతో పూర్తిగా కప్పి, నంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయగోడలకు ప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంత్రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.