త్రిపురారం, ఏప్రిల్ 1 : త్రిపురారం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో సాగింది. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల నుంచి ఆత్మీయ ఆదరణ లభించింది. మహిళలు బొట్టుపెట్టి స్వాగతించగా, వృద్ధ మహిళలు సైతం ఆయన్ను దగ్గరకు తీసుకొని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భగత్తో కరచాలనం చేయడానికి యువతులు పోటీపడ్డారు. సత్యనారాయణపురం, అంజనపల్లి గ్రామాల్లో యువతులు, మహిళలు బోనాలు ఎత్తుకొని టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు ఘన స్వాగతం పలికారు. గెలుపును కాంక్షిస్తూ ఎల్లమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు దారి పొడవునా ప్రచార రథంపై పూలవర్షం కురిపించారు. మరోవైపు గిరిజన సంప్రదాయ నృత్యాలు హోరెత్తాయి. నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడప, కాపువారిగూడెం, లచ్యాతండా, పలుగుతండా, మీట్యాతండా, రాగడప, మాటూరు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
ఆయా గ్రామాల్లో ప్రచారం ముందు డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ భగత్ ప్రచారంలో ముందుకు నడిచారు. ఆసాంతం భగత్ ప్రచార రథయాత్ర జనహోరు మధ్య సాగింది. నీలాయిగూడెం గ్రామంలో భగత్ వృద్ధులను, వికలాంగులను ఆప్యాయంగా పలుకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలందుతున్నాయా..? లేదా..? ఏమైనా సమస్యలున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న యువతులు భగత్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. భగత్తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. అంజనపల్లి గ్రామపంచాయతీలోని సర్వే నం. 305కు సంబంధించి పట్టాలు రాలేదని గ్రామస్తులు భగత్కు వివరించగా పూర్తి వివరాలు సేకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భరోసానిచ్చారు.
అంజనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాల్తితండాను ప్రత్యేక పంచాయతీగా చేయాలని తండావాసులు అడుగగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కల్పించుకొని అతి త్వరలో పాల్తితండా నూతన పంచాయతీ అవుతుందని హామీఇచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురంలోని బొడ్రాయి వద్ద, కాపువారిగూడెంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాపువారిగూడెంలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని దివ్యాంగుడు విన్నవించగా వెంటనే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మిషన్ భగీరథ సీఈతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బాణోతు శంకర్నాయక్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
పుణె, ముంబై, నాగపూర్లో అత్యధిక వైరస్ కేసులు..
మయన్మార్ శరణార్థులపై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మణిపూర్