గజ్వేల్ రూరల్, ఏప్రిల్1: దేశచరిత్రలో తక్కువ సమయంలో ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణం చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని, 600 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను త్వరలోనే బాధితులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం మిషన్ మోడ్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. గురువారం తెల్లవారుజామున ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో రెవెన్యూ, ఇంజినీరింగ్, ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయలతో సహా పూర్తిస్థాయిలో ఇండ్లను అందుబాటులోకి తీసుకు రావాలని, ఇందుకు వారం పాటు నిరంతం అధికారులు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.
పల్లెపహాడ్ కాలనీలో మూడు రోజుల్లో, వేములఘాట్ కాలనీలో ఐదు రోజుల్లో ఇండ్లను పూర్తి చేయాలన్నారు. పనులు క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు 11 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్లెపహాడ్ కాలనీకి బాధ్యులుగా హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీపీవో సురేశ్బాబు, వేములఘాట్ కాలనీకి గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి సరోజ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని, పనుల్లో వేగం పెంచి త్వరగా అద్భుతమైన ఆర్అండ్ఆర్ కాలనీని అందుబాటులోకి తీసుకు వస్తారని తెలిపారు. అధికారుల బృందం త్వరితగతిన కాలనీలో అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తారన్నారు. కాలనీలో ఇండ్ల మధ్య చదును చేయించడం, నల్లా బిగింపు, రంగులు వేయించడం, మురుగుకాల్వల శుభ్ర పర్చడం, లైట్ల బిగింపు, రోడ్లను శుభ్రంగా ఊడ్చడం త్వరగా పూర్తి చేయించాలన్నారు.
ఉదయం నుంచే అధికారులు క్షేత్రస్థాయిలో పనుల్లో నిమగ్నం కావాలని, ప్రత్యేకంగా ఫొటోతో కూడిన బయోమెట్రిక్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు మూడు పూటల హాజరు తీసుకుంటామని, తానే స్వయంగా హాజరును పరిశీలించి విధులకు హాజరుకాని వారిపై వేటు వేస్తానని హెచ్చరించారు. ఈ రెండు కాలనీల్లో పనులు పూర్తయిన తర్వాత ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి కాలనీల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు అనంతరెడ్డి, విజయేందర్రెడ్డి, జయచంద్రారెడ్డి, ఎస్ఈలు చారి, కనకరత్నం, డీఈలు రామచంద్రం, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
వ్యాపారి మన్సుఖ్ను ఊపిరాడకుండా చేసి హత్య
ముఖ్యమంత్రి నా శాఖలో తలదూరుస్తున్నారు: గవర్నర్కు మంత్రి ఫిర్యాదు