దెబ్బతిన్న పులిలా రెండో టీ20లో రెచ్చిపోయిన కోహ్లీసేన సిరీస్ ఆధిక్యంపై కన్నేసింది. దూకుడైన బ్యాటింగ్ సూత్రాన్నే పాటించి నేటి మూడో మ్యాచ్లోనూ ఇంగ్లండ్ను చిత్తుచేయాలని తహతహలాడుతున్నది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిరీస్లోని మిగిలిన మూడు మ్యాచ్లకు అభిమానులను స్టేడియంలోనికి అనుమతించడం లేదు. దీంతో ఆటగాళ్లు మరోసారి ఖాళీ మైదానాల్లో మ్యాచ్లు ఆడనున్నారు.
అహ్మదాబాద్: రెండో టీ20లో అద్భుత విజయంతో మంచి జోష్లో ఉన్న టీమ్ఇండియా సిరీస్లో దూసుకెళ్లేందుకు రెడీ అయింది. మంగళవారం ఇక్కడి మొతెరా స్టేడియంలో జరిగే మూడో టీ20లో ఇంగ్లండ్ను మట్టికరిపించాలని కోహ్లీసేన లక్ష్యంగా పెట్టుకుంది. తొలి పోరులో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్.. ఆదివారం రెండో మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టును చిత్తుగా ఓడించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1 సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంతో జట్టు కూర్పుపై దృష్టిపెట్టిన టీమ్ఇండియా.. దూకుడైన బ్యాటింగ్ పంథానే కొనసాగిస్తూ సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తున్నది.
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మూడో తుదిజట్టులో చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సిరీస్ ఆరంభానికి ముందు హిట్మ్యాన్కు రెండు మ్యాచ్లు విశ్రాంతినిచ్చామన్న కోహ్లీ.. మూడో మ్యాచ్కు అతడిని తీసుకుంటాడా.. లేక గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన లోకేశ్ రాహుల్ను కొనసాగిస్తాడా చూడాలి. శిఖర్ ధావన్ స్థానంలో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ దూకుడైన ఆటతీరుతో కట్టిపడేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి లయ దొరకబుచ్చుకోవడం టీమ్ఇండియాకు శుభపరిణామం. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో భారత బ్యాటింగ్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. స్పిన్ పిచ్ అయితే శార్దూల్కు బదులు అక్షర్ను తీసుకోవడం తప్ప.. బౌలింగ్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) మిగిలిన మూడు మ్యాచ్లకు అభిమానులను అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో మంగళవారంతో పాటు ఈ నెల 18, 20న జరుగాల్సి ఉన్న టీ20లు ఖాళీ మైదానంలోనే జరుగనున్నాయి. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసుకున్న వారికి డబ్బు తిరిగి ఇస్తామని పేర్కొంది.
ఇంగ్లండ్తో రెండో టీ20లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన టీమ్ఇండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో రిఫరీ జవగల్ శ్రీనాథ్ 20 శాతం కోత విధించారు. ఆన్ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరీ, అనంత పద్మనాభన్, థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ స్లో ఓవర్ రేట్పై ఫిర్యాదు చేశారు.
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని భారత యువ సంచలనం ఇషాన్ కిషన్ అన్నాడు. ఇంగ్లండ్తో రెండో టీ20లో టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఇషాన్ మెరుపు అర్ధశతకంతో కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. ‘ఐపీఎల్లో వివిధ దేశాలకు చెందిన నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం నాకు సహకరించింది. నెట్స్లో బౌల్ట్, బుమ్రా బౌలింగ్లో ఆడడం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఐపీఎల్లో ఆడిన విధంగానే స్వేచ్ఛగా ఆడాలని రోహిత్ భాయ్ (ముంబై కెప్టెన్) చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి’ అని ఇషాన్ అన్నాడు. అలాగే కెప్టెన్ కోహ్లీ నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు.