ఓ వలస కూలీ పురిటి నొప్పులతో అల్లాడుతున్నది. చుట్టూ చాలామంది ఉన్నా ఎవరూ సాయం చేయలేదు. అంబులెన్స్కి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. అప్పుడే, బస్ కోసం అటుగా వచ్చింది శోభా ప్రకాశ్ అనే ఉపాధ్యాయురాలు . ప్రసవవేదనతో అల్లాడుతున్న ఆ కూలీని చూసి ఆమె గుండె కరిగిపోయింది. ఓ డాక్టర్ సాయంతో పురుడుపోసి తల్లినీ, బిడ్డనూ రక్షించింది. కర్ణాటకలోని కొడుగు జిల్లా నజారాబాద్కు చెందిన మల్లిక (35) ముంబయిలో వలస కూలీగా పనిచేస్తున్నది. ఆమెకి నాలుగేండ్ల కొడుకు, రెండేండ్ల కూతురు ఉన్నారు. మల్లిక మూడోసారి గర్భం దాల్చింది. అయితే, ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఏం చేయాలో పాలుపోక పరిసరాల్లో ఉన్నవారిని సాయం కోసం అర్థించింది. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే అటుగా వచ్చిన శోభా ప్రకాశ్ ఆ మహిళ వేదనను చూసి ఊరుకోలేకపోయింది. వెంటనే, తన స్నేహితుడు కార్తిక్తో మాట్లాడింది. ఫోన్లోనే పరిస్థితి వివరించింది.
అంతలోనే, పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. శోభా ప్రకాశ్కు ధైర్యం చెప్పాడు డాక్టర్ కార్తిక్. వైద్యుడి సూచన మేరకు పురుడు పోసేందుకు సిద్ధమైంది శోభ. చదువులమ్మ మంత్రసాని అవతారమెత్తింది. తల్లీబిడ్డా క్షేమంగా బయటపడటంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. సినిమాల్లో కనిపించే ఇలాంటి మానవీయ దృశ్యం ముంబయిలోని మైసూర్ పార్క్ పరిసరాల్లో చోటు చేసుకుంది. ‘మొదట్లో భయంగా అనిపించింది. ఆమెను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నా. అందుకే ధైర్యం చేశాన’ని చెప్పుకొచ్చింది శోభా ప్రకాశ్.