కోల్కతా : దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మిథున్ చక్రవర్తి వంటి స్టార్లను ప్రచార బరిలో దింపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో మిథున్ చక్రవర్తితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్లు ఉన్నారు.
ఇంకా ఈ జాబితాలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటులు లాకెట్ ఛటర్జీ, రూపా గంగూలీ, బాబుల్ సుప్రియో, మనోజ్ తివారీ, స్రవంతి ఛటర్జీ, పాయెల్ సర్కార్, హిరన్ ఛటర్జీలు కాషాయ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇక నందిగ్రాం నుంచి పోటీ చేయనున్న సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారిని బీజేపీ బరిలో దింపింది. ఇక మత ప్రాతిపదికన ఓట్లు చీల్చాలనే బీజేపీ కుట్రలు ఫలించవని తాను హిందూ బ్రాహ్మణ మహిళనని మత రాజకీయాలు తన వద్ద చెల్లవని దీదీ స్పష్టం చేశారు.