న్యూఢిల్లీ, మార్చి 9: ఇటీవల కొత్తగా తెచ్చిన నిబంధనలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. అవాంఛిత, మోసపూరిత కమర్షియల్ టెక్ట్స్ మేసేజ్లకు చెక్ పెట్టడంలో భాగంగా ఈ నిబంధనలను ట్రాయ్ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలతో బ్యాంకింగ్, పేమెంట్, ఇతరత్రా లావాదేవీలకు సంబంధించిన మేసేజ్లు, ఓటీపీ డెలివరీలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ కారణంగానే సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది అసౌకర్యానికి గురయ్యారు. దీంతోనే ట్రాయ్ ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నది. టెలికం సంస్థలు ట్రాయ్ నిబంధనలను అమల్లోకి తేవడంతో ఆధార్ సేవలు, చివరకు కరోనా వ్యాక్సినేషన్కూ ఇబ్బందులు వచ్చిపడ్డాయి. కాగా, బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారంగా తెచ్చిన ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా టెల్కోలు వీలైనంత త్వరలో మార్పులు చేపట్టాలని ట్రాయ్ సూచించింది.