న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో స్వచ్ఛందంగా చేరే కొత్త సబ్స్క్రైబర్ల కోసం ఈపీఎఫ్వో ఆధ్వర్యంలోనే ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయనున్నది. వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఈపీఎఫ్వోలో సభ్యులుగా చేరిన వారికి, స్వచ్ఛంద సభ్యులు జమ చేసిన మొత్తం నిధికి ఒకే వడ్డీరేటు వర్తించబోదు. స్వచ్ఛంద సభ్యుల కోసం ఈపీఎఫ్వో ప్రత్యేక నిధిని త్వరలో ప్రారంభించే తేదీని ప్రకటిస్తామని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి.
స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే విషయమై కార్మికశాఖ అధికారులతో కేంద్రం సంప్రదిస్తున్నది. ఈపీఎఫ్వోలో దీర్ఘకాలిక పెట్టుబడులపై స్వచ్ఛంద సభ్యులు లబ్ధి పొందేందుకు తాము అనుమతించబోమని అధికార వర్గాల కథనం. ఈపీఎఫ్వో ప్రత్యేక నిధిలో వ్యక్తులు జమచేసిన సొమ్ము ఆధారంగానే వారికి రిటర్న్స్ లభిస్తాయి. అలాగే ఈపీఎఫ్వో నిధి నుంచి వారి సొమ్ము విత్డ్రాయల్స్ నిబంధనులు కూడా ప్రత్యేకంగా ఉంటాయని అధికార వర్గాల కథనం. ఈపీఎఫ్వో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడానికి ఉద్యోగ భవిష్య నిధి & వివిధ నిబంధనల చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్వోలో ఆరు కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. సంస్థ కార్పస్ ఫండ్గా రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులు ఉన్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సభ్యులుగా చేరేవారికి ఏడు శాతం వడ్డీరేటు లభిస్తుండగా, ఈపీఎఫ్వో సభ్యుల డిపాజిట్లకు 8.5 శాతం అందుతున్నది. సంఘటిత రంగంలోని సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు మాత్రమే ఈపీఎఫ్వోలో సభ్యులుగా చేరేందుకు అనుమతి ఉంది.
చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, న్యాయవాదులు ఈ స్కీమ్ కింద సబ్స్క్రైబర్లుగా చేరేందుకు నిబంధనలు అనుమతించవు. స్వయం ఉపాధి పొందుతున్నవారితోపాటు అన్ని రకాల వ్యక్తులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) తరహా పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తేనున్నది.