న్యూఢిల్లీ, మార్చి 7: కేంద్రప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన ‘వాహన తుక్కు విధానం’ కింద పాత వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చితే కొత్త వాహనాల కొనుగోలుపై 5% రాయితీ లభించనుంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. పాత వాహనాల ఫిట్నెస్ పరీక్షించడానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడానికి కేంద్రాల ఏర్పాటులో రాష్ర్టాలు, ప్రైవేటు సంస్థలకు సహకారం అందిస్తామన్నారు. ఫిట్నెస్ టెస్టులో ఫెయిలైన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని చెప్పారు. వాహన తుక్కు విధానం భారతదేశ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. కనీసం 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. తుక్కుగా మారిన వాహనాల్లోని ఉక్కు, రబ్బరు ఇతర లోహాలను తిరిగి వినియోగించడం వల్ల ఉత్పత్తి ఖర్చు 30-40 శాతం దాకా తగ్గుతుందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన విధానం ప్రకారం వ్యక్తిగత వాహనాలను 20 ఏండ్ల తర్వాత, కమర్షియల్ వాహనాలను 15 ఏండ్ల తర్వాత తుక్కుగా మార్చాలి.