హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కోడి కూర ఘాటెక్కింది. వారంలో కిలో చికెన్ రూ. 50 నుంచి రూ. 70 పెరిగింది. గత వారం స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.160-180గా ఉంది. కానీ, ఆదివారం కిలో ధర ఏకంగా రూ. 220-250 వరకు పలికింది. ఒక్క వారంలోనే ఇంత భారీగా ధరలు పెరుగడంతో సామాన్యులకు మింగుడుపడటం లేదు. బోన్లెస్ చికెన్ ధర కిలో రూ.350-370 ఉండడం గమనార్హం.
చికెన్ ధరలు అమాంతంగా పెరగటం వెనుక బర్డ్ఫ్లూ ప్రభావం ఉన్నది. జనవరిలో దేశంలోని పలు రాష్ర్టాల్లో బర్డ్ఫ్లూ కలకలం నెలకొన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో లేకపోయినా.. బర్డ్ఫ్లూ భయం పౌల్ట్రీని భారీగానే దెబ్బకొట్టింది. ఫలితంగా చాలామంది పౌల్ట్రీ రైతులు కొత్త క్రాప్ వేసేందుకు వెనుకంజ వేశారు. ఫలితంగా ఒక్కసారిగా ఉత్పత్తి పడిపోయింది. దీంతో అనివార్యంగా ధరలు పెరిగాయి. చికెన్ ధరల పెరుగుదల ఈ నెలాఖరు వరకు ఉంటుందని పౌల్ట్రీ నిర్వహకులు తెలిపారు.