సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): అత్యాశ.. నిర్లక్ష్యం.. అమాయకుల అవగాహన రాహిత్యం సైబర్ నేరగాళ్లకు భారీ ఆదాయ వనరులుగా మారాయి. ప్రతి రోజూ వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం చేసేవారు కొన్ని ఘటనల్లో పదో తరగతి కూడా పాసై ఉండరు… అలాంటి వారు ఉన్నత చదువులు చదివిన వారిని నిండా ముంచేస్తున్నారు. ఇందులో అమాయకులు, అత్యాశపరులు ఈజీగా సైబర్నేరగాళ్లకు దొరికిపోతున్నారు. ఓటీపీలు, సోషల్మీడియా ద్వారా జరిగే నేరాలు, రిమోట్ యాప్స్, కేవైసీ అప్డేట్స్ వంటి నేరాలు అవగాహన రాహిత్యంతో జరుగుతుండగా.. కస్టమర్ కేర్, స్ఫూపింగ్ మెయిల్స్తో జరిగే నేరాల్లో ఖాతాదారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తున్నది.
సైబర్నేరాల్లో బాధితుల వైపు నుంచే ఎక్కువగా తప్పులుంటున్నాయి. బాధితులు అత్యాశ, తొందరపాటు, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వంటివి సైబర్నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. మనిషి ఆశనే పెట్టుబడిగా పెడుతూ సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎవరైనా డబ్బిస్తామన్నా, తక్కువ ధరకు వస్తువు వస్తుందనుకున్నా.. అది ఎందుకు వస్తుంది మనకు అనే చిన్న లాజిక్ను ఆలోచించాలి. కొన్ని రోజుల పరిచయానికి కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఎలా పంపిస్తారు ? సెక్యూరిటీ లేకుండానే రుణాలు ఎందుకు ఇస్తారు..? అర్హత లేకుండా డబ్బు తీసుకొని ఉద్యోగం ఎలా ఇస్తారు..? ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఆలోచించకుండా ఈజీగా సైబర్నేరగాళ్ల చేతిలో బాధితులు చిక్కుతున్నారు. ఇకనైనా అప్రమత్తంగా ఉంటూ అత్యాశకు వెళ్లకుండా ఉంటే మోసాలకు ఈజీగా చెక్పెట్టవచ్చు. – కేవీఎం ప్రసాద్, సీసీఎస్ సైబర్క్రైమ్స్