చెన్నై, ఫిబ్రవరి 12: ఉత్తరాఖండ్ జలవిలయానికి కేంద్రమైన నందాదేవి పర్వతం కొండ చరియలు విరిగిపడటం వల్ల దాని అంచున భారీ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వెడల్పు అర కిలోమీటరు కన్నా ఎక్కువగా (550 మీటర్లు) ఉన్నది. ఫ్రాన్స్కు చెందిన ఉపగ్రహం ప్లియడీస్ ఈ నెల 9న తీసిన చిత్రాల్లో ఈ అంశం స్పష్టమవుతున్నది. యూరోపియన్ యూనియన్ శాటిలైట్ సెంటినెల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తాజా ఉపగ్రహ చిత్రాలను బట్టి.. నందాదేవిని ఆనుకొని ఉన్న రోంటీ శిఖరాగ్రంపై ఉన్న హిమానీనదం నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. అవి దాదాపు 2 కిలోమీటర్ల దిగువన ఉన్న రోంటీ లోయలో పడి హిమ ఉత్పాతం సంభవించింది. హిమానీనదం నీటివల్ల మొదట రోంటీ నదిలో ప్రవాహం పెరిగి దిగువన ఉన్న రుషిగంగ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. కాగా, రుషిగంగలో వరద ఉద్ధృతి పెరిగిన చోట కొత్తగా సరస్సు ఏర్పడింది. రైనీ గ్రామంలోని తపోవన్ టన్నెల్ సమీపంలోనే ఇది ఏర్పడటం గమనార్హం. ప్రవాహంలో వచ్చిన మట్టి మేట వేయడంతో ఈ నీరు నిలిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు, టన్నెల్లో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 36 మృతదేహాలను వెలికితీశారు. 168 మంది ఆచూకీ గల్లంతైంది.