ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్
మొదటి, రెండో విడుత సర్వేల్లో 1232 మంది గుర్తింపు
పాఠశాలల్లో ముగిసిన ప్రవేశాలు
మంచిర్యాల అర్బన్, జూలై 18 : చిన్నతనంలో పోలియో, పక్షవాతం, ఎముకల బలహీనత, బహుళ వైకల్యంతో అవస్థలు పడుతున్న వారికి సర్కారు భరోసానిస్తున్నది. అలాంటి వారిని పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో సర్కారు సమగ్ర శిక్షా అభియాన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి విద్యాహక్కు చట్టం ప్రకారం సమాన అవకాశాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా ప్రభావంతో గతేడాది నుంచి ప్రత్యక్ష శిబిరాలు, తరగతులు నిర్వహించకపోయినా ఆన్లైన్లో సేవలందిస్తున్నది.
ఇంటింటికీ తిరిగి సర్వే..
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో మళ్లీ ప్రత్యేక అవసరాలు కలిగిన వారి వివరాలను సేకరించే కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా మండలాల్లోని రిసోర్స్ పర్సన్లు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఇంటింటికీ తిరుగుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా దివ్యాంగులను గుర్తించారు. ఇప్పటి వరకు జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, జైపూర్, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల, తాండూరు (14) మండలాల్లోని ఐఈఆర్పీ భవిత కేంద్రాల పరిధిలో 190 మంది నమోదై ఉన్నారు. గత మే నెలలో రిసోర్స్ పర్సన్లు మొదటి విడుత సర్వే పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా 1104 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం కావడంతో ఈ నెల 8వ తేదీలోగా రెండో విడుత సర్వే చేపట్టి మరో 128 మందిని గుర్తించారు. మొదటి, రెండు విడుతల్లో మొత్తంగా 1232 మందిని గుర్తించారు. ఇందులో భవిత కేంద్రాలకు వచ్చే వారు 190 మంది, ఇంట్లో ఉండే వారు 100 మంది, పాఠశాలలకు వెళ్లగలిగే వారు 764 మంది, బడి బయట పిల్లలు 129 మంది, ఐదేండ్లలోపు చిన్నారులు 49 మంది ఉన్నారు. మానసిక, శారీరక వైకల్యంతో పాటు వినికిడి, జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారు, అంధుల వివరాలను సర్వేలో నమోదు చేశారు.
19 ఏండ్ల వారిని సైతం..
గతంలో ఒకటి నుంచి 14 ఏండ్ల వయసు వరకు మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. తాజాగా 19 ఏండ్ల వయసు వరకు అవకాశం కల్పించారు. వైకల్యం కారణంగా చదువు మధ్యలో మానేసి ఇంట్లో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరిని సమీప కేంద్రాల్లో చేర్పించనున్నారు. వారికి శిక్షణ పొందిన రిసోర్సు పర్సన్లు పలు మార్గాలలో అవగాహన కల్పించనున్నారు. మార్పు వచ్చాక వారిని సాధారణ పాఠశాలల్లో చేర్పిస్తారు. రాలేని స్థితిలో ఉన్న వారి ఇండ్ల వద్దకు రిసోర్సుపర్సన్లు వెళ్లి సేవలు అందించనున్నారు. ప్రత్యక్ష తరగతులుంటే సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నియమించిన ఫిజియోథెరఫిస్ట్లు మండల కేంద్రాల్లో వారానికి ఒక రోజు ఫిజియోథెరపీ చేయిస్తారు. వీరికి ఎస్కార్ట్ అలవెన్స్ కింద రవాణా ఖర్చులు చెల్లిస్తారు. అలాగే భవిత కేంద్రాలకు వచ్చే వారికి మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే కేంద్రాల నిర్వహణ
జిల్లాలో 23 మంది రిసోర్సుపర్సన్లు సర్వే నిర్వహించారు. రెండు విడుతల్లో 1232 మం దిని గుర్తించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వారికి అన్నీ అందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా ప్రభావంతో ప్రత్యక్ష శిబిరాలు, తరగతులు నిర్వహించకపోయినా ఆన్లైన్లో సేవలందించాం. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాలను నిర్వహిస్తాం.