సుందరీకరణ పనులతో పట్టణానికి కొత్త కళ
మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆధునీకరణ పనులు
మంచిర్యాల టౌన్, జూలై 15 : మంచిర్యాల పట్టణంలో ఆధునీకరణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాత పద్ధతులు, మూస ధోరణులను విడనాడాలని సూచించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు, రద్దీ, బస్టాండ్ ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఫలితంగా గడిచిన రెండు నెలల కాలంలో మంచిర్యాల పట్టణానికి కొత్త శోభ సంతరించుకుంది. పెయింటింగ్స్తోపాటు గ్రీనరీ చూపరులను ఆకట్టుకుంటున్నది. ఐబీ ఏరియాలోని బస్టాండ్, ఐఐటీ ప్రాంతంలోని బస్టాండ్లను ఆధునీకరించడంతోపాటు బస్టాండ్ లోపల అందమైన పెయింటింగ్స్, కూర్చునేందుకు బల్లలను ఏర్పాటు చేశారు. బస్టాండ్, కాలేజీరోడ్తోపాటు ప్రధాన రహదారులపై డివైడర్ల మధ్య అవెన్యూ ప్లాంటేషన్లోని చెట్లకు పెయింటింగ్స్ వేశారు. ట్రాఫిక్ ఐలాండ్లను రంగులతో అలంకరించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెయింటింగ్స్. గ్రీనరీ, లైటింగ్ పనులు చేపట్టారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా కార్పెట్ గ్రాస్ ఏర్పాటు, లైటింగ్ పనులు చేపట్టనున్నారు.
ఆకట్టుకుంటున్న హ్యాకర్జోన్లు.
మంచిర్యాలలో వీధి వ్యాపారుల కోసం, ప్రమాదాల నివారణకు హ్యాకర్ జోన్లను నిర్మిస్తున్నారు. ఐబీలో రూ.10 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఐటీఐ, పాత మంచిర్యాల ప్రాంతాల్లో రూ.50 లక్షలు వెచ్చించి మరో రెండు హ్యాకర్ జోన్లు నిర్మించనున్నారు. వీటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు.