మంచిర్యాలటౌన్, జూన్ 15 : మంచిర్యాల పట్టణంలోని ఆండాళమ్మ కాలనీలో రూ.11.97 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక (ఎల్పీజీ గ్యాస్ క్రిమటోరియం)ను కలెక్టర్ భారతీ హోళికేరి మంగళవారం పరిశీలించారు. పరికరానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా బారిన పడి చనిపోతున్న వారిని దహనం చేసేందుకు ప్రభుత్వం ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసిందని, ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి అరగంట సమయం పడుతుందని, ఇందుకు 10 కిలోల గ్యాస్ అవసరముంటుందని వారు తెలిపారు. యంత్రం తిరిగి చల్లబడేందుకు గంటన్నర పడుతుందని వారు వివరించారు. మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, ఎంఈ మధూకర్, టీపీవో సత్యనారాయణ ఉన్నారు.