బోదవ్యాధి రహిత జిల్లాకు కసరత్తు
నేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలు
మంచిర్యాల జిల్లాలో 1,619 బృందాల ఏర్పాటు
20 లక్షల ట్యాబ్లెట్లు రెడీ
జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ఆరోగ్యశాఖ దృష్టి
దోమతెరల వినియోగంతోనే రక్షణ
మంచిర్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ) : దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు.. దోమకాటు ద్వారా మలేరియా, డెంగీ, మెదడువాపు, చికున్ గున్యాతో పాటు బోదకాల వ్యాధి వ్యాపిస్తాయి. క్యూలెక్స్ దోమ కుట్టడంతో బోదవ్యాధి వస్తుంది. ఈ దోమలు ఎక్కువగా మురుగునీటి నిల్వల్లో పెరుగుతాయి. తరచూ వచ్చే జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిల్లలు కట్టడం, శరీరంలోని అవయవాల వాపు, ప్రత్యేకించి కాళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాల్లో నొప్పి పుట్టడం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. బోదవ్యాధి రాకుండా సంవత్సరానికి ఒక మోతాదు డీఈసీ మాత్రలు వాడాలి. దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు దోమ తెర, జాలీలు వినియోగించాలి. మురుగు నీటి నిల్వలను వారానికి ఒకసారి శుభ్రపరిచి తగు రీతిలో నివారణ చర్యలు చేపట్టాలి. ఈ నెల 15 నుంచి 17 వరకు జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ (ఎన్వీబీడీసీ)కు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పైలేరియా రహిత జిల్లా కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లు పైబడిన 7.52 లక్షల మంది చిన్నారులకు ఒకేసారి మాత్రలను అందించేందుకు 1,619 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రానికి 20 లక్షల ట్యాబ్లెట్లు (మాత్రలు) వచ్చినట్లు డీఎంహెచ్వో సుబ్బారాయుడు తెలిపారు.
శుభ్రతతో వ్యాధులకు చెక్..
వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఎడిస్ దోమలు కుట్టడంతో డెంగీ జ్వరం వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ దోమలు మంచినీటి నిల్వల్లో పెరుగుతాయి. జిల్లాలో ఎక్కువగా ట్రైబల్ ఏరియాల్లో ఈ వ్యాధి లక్షణాలతో కూడిన జ్వరాలు తరచూ వ్యాపిస్తాయి. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో మాత్రమే ఈ వ్యాధి నిర్ధారణకు పరీక్షా సదుపాయం ఉంది. డెంగీ, చికున్ గున్యా నిర్లక్ష్యపు వ్యాధులు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను వారానికి ఒకసారి పూర్తిగా శుభ్రపరచడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో ఆశ, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, వీఆర్ఏ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా సమాఖ్య సభ్యులు, ఎన్జీవోలు తమ బాధ్యతగా పాల్గొంటారు. దోమల నివారణ చర్యలు పాటించి వ్యాధులను నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వ్యక్తిలో బోదవ్యాధి లక్షణాలు కన్పించకుండా కూడా వ్యాధి బారిన పడవచ్చు.
ఐదేండ్లు.. 867 కేసులు..
2016 నుంచి 2020 వరకు అంటే ఈ ఐదేండ్లలో మొత్తం 867 పైలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2016లో 6 కేసులు, 2017లో 65, 2018లో 773, 2019లో 18 మందికి పైలేరియా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 2020లో కేవలం ఐదు మాత్రమే బోదవ్యాధి కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తం పింఛన్ అర్హత కేసులు 517 కాగా, 277 మంది లబ్ధి పొందారు. 240 మంది ఇతర పెన్షన్ సౌకర్యం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, జూలై 14: బోదకాలు వ్యాప్తిని అరికట్టేందుకు డై ఇథైల్ కార్బోమ్జైన్ సిట్రైట్ (డీఈసీ), అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ప్రత్యేకంగా మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 830 పైలేరియా కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ నెల 15,16, 17 తేదీల్లో సామూహిక మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం 250 మందికి ఒక డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ చొప్పున జిల్లాలో మొత్తం 2056 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లను నియమించారు. వీరిని సమన్వయం చేసేందుకు 206 మంది పర్యవేక్షకులను నియమించారు. జిల్లాలో మొత్తం 5,75,070 జనాభాలో, గర్భిణులు, రెండేళ్లలోపు వారు, ఇతర రుగ్మతలతో బాధపడేవారిని మినహాయించి, మిగతా 5,13,899 మందికి అందించనున్నారు. కాగా, ఇప్పటికే 12,84,750 డీఈసీ మాత్రలు 5,13,899 అల్బెండజోల్ మాత్రలు జిల్లా నుంచి పీహెచ్సీలకు చేరాయి. జిల్లాలోని 22 పీహెచ్సీలు, 2 యూపీహెచ్సీలు 108 సబ్సెంటర్లలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందకు పకడ్బందీ ప్రణాళికను జిల్లా యంత్రాంగం పక్కాగా తయారు చేశారు.
మాత్రలు తప్పకుండా తీసుకోవాలి..
బోదవ్యాధి నిర్మూలనకు తప్పకుండా మందులు వాడాలి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ శిక్షణ పొందిన డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు బోదవ్యాధి మాత్రలను ఉచితంగా మింగిస్తారు. సంవత్సరానికి ఒకసారి పైలేరియా వ్యాధి మాత్రలు మింగడంతో శరీరంలో బోదవ్యాధి తగ్గుతుంది. రెండేండ్ల కంటే తక్కువగా వయసు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారంతా అడ్మిని స్ట్రేటర్ సమక్షంలో యాంటీ పైలేరియా మాత్రలను తీసుకోవాలి. అల్పాహారం లేదా భోజనం చేసిన తర్వాత ఈ మాత్రలు మింగాలి. – డా.ఎస్.అనిత, ఎన్వీబీడీసీపీ అధికారి, మంచిర్యాల