ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
కోటపల్లి, జూలై 14 : కోటపల్లి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎగువ పాంత్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామం సమీపంలోని తుంతుంగా చెరువులోని భారీగా వరద నీరు రావడంతో మత్తడి ప్రవాహం పెరిగింది. దీంతో చెరువు అవతల ఉన్న ఎదుల్లబంధం, సిర్సా, రొయ్యలపల్లి, పుల్లగామ, ఆలుగామ, జనగామ, వెంచపల్లి, సూపాక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహం తగ్గే వరకు నదిలోకి వెళ్లవద్దని చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నక్కలపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న లోతొర్రె ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్నారం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి చేపల వేట కోసం వెళ్లవద్దని సీఐ సూచించారు.
కన్నెపల్లి మండలంలో..
కన్నెపల్లి, జూలై 14 : భీమిని, కన్నెపల్లి మండలాల్లో బుధవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురిసింది. భీమిని మండలంలోని ఎర్రవాగు, కన్నెపల్లి మండలంలోని నల్లవాగు, తిమ్మాపూర్ వాగులు ఉప్పొంగాయి. భీమిని వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెల్లంపల్లి నుంచి వడాల, కేస్లాపూర్, పెద్దపేట, కాగజ్నగర్కు వెళ్లే రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మాపూర్లో వాగు ఉప్పొంగడంతో పత్తి చేన్లు నీటిలో మునిగిపోయాయి.
మంచిర్యాల పట్టణం అతలాకుతలం..
మంచిర్యాలటౌన్, జూలై 14: మంచిర్యాల పట్టణంలో మంగళవారం రాత్రితో పాటు బుధవారం ఉదయం నుంచి భారీ నుంచి మోస్తరుగా వర్షం కురిసింది. ఇండ్ల మధ్యన వరద చేరడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన సీతారామ కాలనీ, బృందావన్ కాలనీ, తిలక్నగర్, హమాలీవాడ, ఎన్టీఆర్ నగర్, పాతమంచిర్యాల, వడ్డెరకాలనీ, ఏసీసీ ప్రాంతాల వాసులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల రోడ్లు చిత్తడిగా మారాయి.
తాండూర్ మండలంలో..
తాండూర్, జూలై 14 : వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండంతో మండలంలోని చెరువులన్నీ నీటితో నిండి జలకళతో కళకళలాడుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. మత్తళ్లు, రోడ్ డ్యాంల వద్ద యువకులు, మత్స్యకారులు చేపలు పట్టారు.