మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
అధికారులతో సమావేశం
హాజీపూర్, జూలై 13 : పైలేరియా నివారణకు కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమ పర్యవేక్షకురాలు రాజశ్రీ, జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ – యూనిట్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోదకాలు నివారణకు గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 7, 96,628 మంది రెండేళ్లు పైబడిన వారందరికీ ఆల్బెండజోలు మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఆహారం తీసుకున్న తర్వాతే మాత్ర వేసుకోవాలన్నారు. చిన్న పిల్లలకు మాత్రలను నలిపి పిండి చేసి ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 1600 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి బృందానికి 250 మందిని కేటాయిస్తు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ నెల 15న 80 శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 16, 17 తేదీలలో మిగిలిన వారికి (మాప్ ఆప్) ఇవ్వాలని సూచించారు. మాత్రలు అందించిన ప్రతి ఇంటికి మార్క్ చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు 30 మంది వైద్యాధికారులు, 49 మంది సూపర్వైజర్లు, 243 మం ది ఆరోగ్య కార్యకర్తలు, 662 మంది ఆశ, 930 మంది అంగన్వాడీలు, 1525 మంది ఇతర స్వచ్ఛంద కార్యకర్తలను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నీరజ, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఫయాజ్ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.