ఇప్పటికే పూర్తయిన స్థలాల గుర్తింపు
2021-22లో పూర్తి చేసేలా ప్రణాళికలు
ఒక్కో పార్కులో 31వేల మొక్కలు నాటేందుకు ప్లాన్
వాకింగ్ట్రాక్, పిల్లలు ఆడుకునేలా సౌకర్యాలు
మంచిర్యాల, జూలై 11, నమస్తే తెలంగాణ : పర్యావరణ సమతుల్యత కోసం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట ఉద్యానాలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మండలానికో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకు మండలాల్లో స్థలాలను గుర్తించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ జిల్లా అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో గతనెల 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సమావేశంలో పలు సూచనలు జారీ చేశారు.
ప్రతి మండలంలో.. పది ఎకరాలలో..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనం (బీ పీపీవీ) నిర్మించాలని ప్రణాళికలు చేశారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా 2021-22 మధ్య యాదాద్రి ఫారెస్ట్ మోడల్ (వైఎఫ్ఎం) కొన్ని సూత్రాలు ప్రతిపాదించింది. ఇది హరిత హారం కార్యక్రమం. ఈ గ్రీన్ జోన్లలో యాదాద్రి ఫారెస్ట్ మోడల్ తోటలు పనిచేస్తాయి. .
రూ. 44 లక్షల చొప్పున ఖర్చు…
ప్రతి మండలంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కులకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయనున్నది. ఒక్కో వనానికి ఏకంగా రూ. 44లక్షలు వెచ్చించనున్నారు. ఇందులో సామగ్రి, మొక్కల కోసం రూ. 28 లక్షలు, కూలీలకు రూ. 16లక్షలు వినియోగించనున్నారు. ఇప్పటికే అన్ని గ్రామపంచాయతీల పరిధిలో పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇవి చిన్నవి కావడంతో ఎక్కువ మొక్కలు పెంచే అవకాశం లేదు. దీంతో మండలానకో మెగా పార్కు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఒక్కో వనంలో 31 వేల మొక్కలు…
ప్రతి బృహత్ ప్రకృతి వనంలో 31 వేల మొక్కలు పెంచనున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి ప్రకృతి వనాన్ని చిట్టడవిని తలపించేలా చేయనున్నారు. ప్రధానంగా 20 రకాల మొక్కలు ఉండేలా చూస్తారు. వీటిలో టేకు, ఇప్ప, జామ, దానిమ్మ, కరివేపాకు, ఈత, ఉసిరి, సీమ, చింత, తంగేడు, వెదురు, జమ్మి, సీతాఫలం, రేగు, కుంకుడు, పనస, వెలగ, నేరేడు, పారిజాతం, తిప్పతీగ తదితర మొక్కలు నాటనున్నారు. వనానికి చుట్టూ కంచె సైతం వేసి ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేలా సౌకర్యాలు, ఆటస్థలం, రోడ్డు, భూములను చదును చేయడం మొదలుకొని మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు వాచర్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నారు.
జిల్లాలో స్థలాల గుర్తింపు
బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం మంచిర్యాల జిల్లాలో స్థలాలను గుర్తించారు. మండలకేంద్రంలోనూ, అందుబాటులో లేని చోట్ల పలు గ్రామ పంచాయతీలో సైట్లను సంబంధిత రెవెన్యూ అధికారులు గుర్తించి, పరిశీలించారు. ఆయా చోట్ల స్థలాలను పంచాయతీ రాజ్ శాఖ వారికి అప్పగించారు. జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో బూదాకలన్ గ్రామ పంచాయతీలో, భీమిని మండలంలో పెద్దపేట (వడాల శివారు) గ్రామ పంచాయతీలో, చెన్నూర్ మండలంలో సోమనపల్లి జీపీలో, దండేపల్లి మండలంలో వెల్గనూర్ (అందుగుల పేట్)జీపీలో బీ పీపీవీ కోసం స్థలాన్ని కేటాయించారు. ఆయా స్థలాలను సం బంధిత శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. భీమారం మండల కేంద్రంలో స్థలాన్ని పరిశీలించారు. కోటపల్లి మండలకేంద్రంలో, మందమర్రి మండలంలో బొక్కల గుట్ట జీపీలో, కాసిపేట మండలంలో పల్లంగూడ జీపీలో, తాండూర్ మండలం అచ్చలాపూర్ జీపీలో, నెన్నెల మండలకేంద్రంలో, వేమనపల్లి మండలం జిల్లెడలో స్థలాన్ని గుర్తించారు. పంచాయతీ రాజ్ శాఖకు ఆయా స్థలాలలను అప్పగించారు. జైపూర్, జన్నారం, కన్నెపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో స్థలాన్ని గుర్తించారు. ఆయా స్థలాలను సంబంధిత శాఖకు అప్పగించాల్సి ఉంది. ఈ ఐదు మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం స్థలం పరిశీలించినా, పీఆర్ శాఖకు స్వాధీనం చేయలేదు.
అటవీ సంపద పెంపుదలకు..
హరిత తెలంగాణలో భాగంగా అటవీ శాతాన్ని, సంపదను పెంచేందుకు బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని చేపడుతున్నారు. మీటరు దూరంలో మొక్కలను నాటడంతో దట్టమైన ఫారెస్ట్ తయారవుతుంది. అన్ని మండలాల్లో బీ పీపీవీల నిర్మాణంతో వాతావరణమంతా పచ్చగా మారుతుంది. ఆక్సీజన్ కొనుక్కోవాల్సిన అవసరం తప్పుతుంది. ప్రాణవాయువు కోసం పాకులాడాల్సిన పని ఉండదు. ప్రకృతి పచ్చగా ఉండడంతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
హలో డాక్టరమ్మా.. హార్టు మిస్సాయే!
ఇన్స్టా గ్రామ్ ద్వారా హీరోయిన్ …
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి