మంచిర్యాల, సెప్టెంబర్ 20, (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా డెంగీ 2016 నుంచి ఇప్పటి వరకు 111 మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్కరు కూడా మృతి చెందలేదు. 588 మంది డెంగ్యూ బారిన పడగా, 2019లో నలుగురు మృతి చెందారు. వైద్యులు, బ్రీడ్ చెకర్స్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు రోజూ వైద్య సేవలందిస్తూ ప్రజలు వ్యాధుల బారినపడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
జాగ్రత్తగా ఉండాలి..
డెంగీ ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనే దాడి చేస్తున్నది. ఈ మాసాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చలికూడా ఎక్కువగా ఉంటుంది. ఇక జ్వరం వస్తే మరీ దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా ఉండాలి.
డెంగీ లక్షణాలు ..
డెంగీ వచ్చిందంటే త్వరగా అలసిపోతారు. ఏ పనీ చేయాలనిపించదు. చిన్నచిన్న వాటికే నీరసపడిపోతుంటారు. ఆకలి వేయదు. అసలు ఏం తినాలనిపించదు. రుచి గ్రహించలేరు. నాలుక మొత్తం చచ్చుబడినట్లు అనిపిస్తుంది. కొంతమందికి వారి శరీరాన్ని బట్టి ఎక్కువ ఉక్కపోత ఉంటుంది. లేదా ఎక్కువ చలిగా ఉంటుంది.
పెరుగుతున్న డెంగీ
జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా, డెంగీ కేసులు మాత్రం గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు రెట్టింపు సంఖ్య దాటాయి. గతేడాది మలేరియా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 75 డెంగీ కేసులు నమోదయ్యాయి. 2016లో మలేరియా కేసులు 42 ఉండగా, 2017లో మాత్రం వాటి సంఖ్య పెరిగింది. 62 మందికి వచ్చింది. వైద్య శాఖ అప్రమత్తంగా కాగా, మలేరియా కేసులు అమాంతం తగ్గుముఖం పట్టాయి. 2018లో 3 నమోదు కాగా, 2019, 2020లో రెండేసి చొ ప్పున కేసులు కనిపించాయి. ఈయేడాదిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మలేరియా జ్వరం నమోదు కాకపోవడం గమనార్హం. డెంగీ కేసులను పరిశీలిస్తే 2016లో 9 మందికి రాగా, 2017లో 38 నమోదయ్యాయి. 2018లో 88 మం దికి రాగా, 2019లో మాత్రం వాటి సంఖ్య భారీగా పెరిగిం ది. 346 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. వైద్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2020లో 32 మందికి రాగా, ఈ యేడాదిలో ఇప్పటి వరకు 75 కేసులు నమోదైనట్లు సంబంధిత వైద్యాధికారిణి అనిత తెలిపారు.
వైద్యశాఖ ప్రత్యేక చర్యలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జూన్ 15 వరకు దోమ తెరలను పంపిణీ చేశారు. వానకాలం ప్రారంభం కాకముందు నుంచే ఫీవర్ సర్వే నిర్వహించారు. కొవిడ్తో పాటు మలేరియా టెస్టులు, జ్వర పరీక్షలు చేయించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు కూడా ఇంటింటికీ, సబ్ సెంటర్లలోకి వెళ్లి విరివిగా వైద్య సేవలందిస్తున్నారు. మలేరియాతో పాటు అనుమానం వస్తే డెంగీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ (ఎన్వీబీడీసీపీ) అధికారి డా.అనితతో పాటు ఎపిడమియాలజిస్ట్ సుమన్, సబ్ యూనిట్ ఆఫీసర్ నాందేవ్, పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎవరికైనా డెంగీ లక్షణాలు కనిపిస్తే సదరు వ్యక్తి బ్లడ్ సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. డెంగీ వచ్చిన వ్యక్తి ఇంటిలో, బయట పరిసరాల్లో ద్రవాన్ని స్ప్రే చేయిస్తున్నారు. దోమల నివారణకు పైరిత్రమ్, ద్రవాన్ని స్ప్రే చేయిస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా పది మంది సభ్యులు పనిచేస్తున్నారు. జిల్లాలో 10 మంది బ్రీడింగ్ చెకర్స్ జూలై 15వ తేదీ నుంచి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరు రెండు పీహెచ్సీల చొప్పున గ్రామాల్లో రోజుకు 100 ఇండ్లకు వెళ్తున్నారు. నిలువ ఉన్న నీటిని పారబోయించడం, ఇంట్లో సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరించడం, దోమలు రాకుండా జాగ్రత్తలు సూచించడం చేస్తున్నారు. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉంటే పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో శుభ్రం చేయిస్తున్నారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలపై ఆరా తీయడం, అవసరమైతే సంబంధిత పీహెచ్సీ సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. మలేరియా, డెంగీ పరీక్షలు చేయిస్తుంటారు. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే సంబంధిత ప్రాంతాల్లో పైరిత్రమ్, టిమిఫాస్ పిచికారీ చేయిస్తున్నట్లు డా.అనిత పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల సహకారంతో ముందుకెళ్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజూ డ్రైడే నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వివరించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
జ్వరం ఎక్కువగా దోమల వల్ల వస్తుంది. ముందు వాటిని తరిమివేయాలి. ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి. చీకటి పడగానే తలుపులు, కిటికీలు వేసుకోవాలి. చుట్టు పక్కల నీటి గుంతలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. పడుకునేటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.
ఒంటికి వేపనూనె రాయాలి. కేవలం అది మాత్రమే రాసుకోవడం ఇబ్బందిగా అనిపించి వాసనగా అనిపిస్తే కొబ్బరినూనెతో కలిపి రాసుకోవచ్చు.
దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి.
పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
పూల కుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.
ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి ఆహారం తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు. వండిన ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలు పెట్టాలి.
ఈ సమయంలో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా వండుకోవడం మంచిది. సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో ఎక్కువ అల్లం, వెల్లుల్లి వాడాలి. తాజా కూరగాయలతో కూడా సలాడ్లో భాగం చేసుకోవాలి. సీజనల్ పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. నీటిని కాచి చల్లార్చి తాగాలి.
స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం..
జిల్లాలో దోమలు, డెంగీ నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం. ముందస్తుగా దోమ తెరలను పంపిణీ చేశాం. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా చర్యలు తీసు కున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక బృందాలతో గ్రామాల్లో పర్య టిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఫీవర్ సర్వే నిర్వహిం చాం. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. దోమలు రాకుండా చర్యలు చేపడుతున్నాం. బ్లీచింగ్, ఇతర పౌడర్లు చల్లిస్తున్నాం. నీరు నిల్వఉంటే పారబోసేలా చూస్తున్నాం.
ఇంటింటా సేవలందిస్తున్నాం..
నా పేరు శివ. నేను బ్రీడింగ్ చెకర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. జిల్లాలో జూలై 15వ తేదీ నుంచి 10 మంది సభ్యులం పనిచేస్తున్నాం. ఒక్కో వ్యక్తికి రెండు పీహెచ్సీలు అప్పగిం చారు. ఆశ కార్యకర్త లేదా ఏఎన్ఎంతో కలిసి రోజుకు వంద ఇండ్లు తిరుగుతున్నాం. వైద్య సిబ్బందితో కలిసి డ్రైడే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాం. సాధారణంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో టిమిఫాస్ స్ప్రే చేస్తున్నాం. అవసరమైనప్పుడు, డెంగీ పాజిటివ్ వచ్చినప్పుడు వారింట్లో, చుట్టుపక్కల ఇండ్లకు అవసరమైన ద్రావణాలు పిచికారీ చేయిస్తుంటాం.
అవగాహన కల్పిస్తున్నాం..
రోజూ రెండు పీహెచ్సీలలోని వంద ఇండ్లలో వైద్య సేవలందిస్తున్నాం. సీజనల్ వ్యాధులు, రోగాలు రాకుండా జాగ్రత్తలు వివరిస్తున్నాం. కూలర్లు, పాత్రలు, ఇంట్లోని పరిసర ప్రాంతాల్లో నిలువ ఉన్న నీటిని తీసివేసేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. వారితో కలిసి పారబోయిస్తున్నాం. డెంగీ పాజిటివ్ వచ్చిన ఇంటికి పక్కల ఉన్న 50 ఇండ్లకు కూడా టిమిఫాస్ పిచికారీ చేస్తున్నాం.