మహబూబ్ నగర్ : లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల కఠిన ఆంక్షలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్పై బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా కేంద్ర దవాఖానలో 60 వెంటిలేటర్లు, 200 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
మరో వారంరోజుల్లో మొత్తం 500 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలో మరో 4 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దవాఖానలో 3 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దంటూ వాహనదారులకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.