నాగర్కర్నూల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ వ్యవసాయ సీజన్లలో పెట్టుబడులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే రైతుబంధు పథకం వల్ల నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతుండటం గమనార్హం. ఎకరాకు రూ.5వేల చొప్పున వానకాలం, యాసంగి సీజన్లలో రెండుసార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్నది. ఉమ్మడి పాలమూరులోనే ఈ సాయంలో నాగర్కర్నూల్ ముందుండడం గమనార్హం. రాష్ట్రంలో మూడో స్థానంలో ఉండటం మరీ విశేషం. రాష్ట్రంలో నల్లగొండలో 12.18 లక్షల ఎకరాలకుగానూ 4.72లక్షల మంది రైతులకు రూ.608కోట్లు, సంగారెడ్డిలో 3.31లక్షల మంది రైతులకుగానూ రూ.383.08 కోట్ల రైతుబంధు సాయం కింద మంజూరైంది. నాగర్కర్నూల్ జిల్లాలో 7.39లక్షల ఎకరాలకుగానూ 2,75,820 మంది రైతులకు రూ.369.57కోట్లు మంజూరయ్యాయి. నారాయణపేట జిల్లాకు రూ.226.58 కోట్లు, వనపర్తి జిల్లాకు రూ.180.77 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాకు రూ.227.03 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాకు రూ.227.35 కోట్ల చొప్పున రైతుల ఖాతాల్లో చేరుతున్నాయి. రైతుబంధు సాయంలో నాగర్కర్నూల్ జిల్లా రైతన్నలు అత్యధికంగా లబ్ధిపొందుతున్నారు.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
రైతుబంధు సాయం పెరగడంతో జిల్లాలో ఏటా వ్యవసాయంపై రైతులు ఆసక్తి పెంచుకొంటున్నారు. 2016-17లో వానకాలం సాధారణ విస్తీర్ణం 1,98,106 హెక్టార్లు కాగా 2,23,934 హెక్టార్ల పంట సాగైంది. ఇందులో వరి సాగు 11,138 హెక్టార్లకుగానూ 7,674 హెక్టార్లు సాగైంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 1,602 హెక్టార్లకుగానూ 1,244 హెక్టార్లలో సాగైంది. ఇక 2020లో 2.45 లక్షల హెక్టార్లు, 2021లో 2.74 లక్షల హెక్టార్లు సాగవగా ప్రస్తుత 2021-22 సీజన్లో 2.45 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికిగానూ 2.73 లక్షల హెక్టార్లలో (6,13,878 ఎకరాలకు గానూ 6,84,819 ఎకరాల్లో..) సాగు విస్తీర్ణం పెరిగింది. ఏటా జిల్లా పంటల సాగు, దిగుబడిలో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పత్తి, వేరుశనగ, వరి పంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే గ్రామాల్లో మహిళా సంఘాలు, సింగిల్విండోల ద్వారా కొనుగోళ్లు చేస్తుంది. ఇందుకు సంబంధించిన డబ్బులను రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా వానకాలం, యాసంగి సీజన్లలో రెండుసార్లు ఆర్థికంగా లబ్ధిపొందుతున్న రైతులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
పెట్టుబడి సాయంతో మేలు
రైతుబంధు సాయం వల్ల జిల్లాలో రైతులకు అత్యధికంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు తోడుగా వ్యవసాయ సీజన్ ఆరంభంలో రెండు విడుతలుగా అందిస్తున్న పెట్టుబడిసాయం వల్ల అప్పులు చేయడం తగ్గింది. విత్తనాలు, ఎరువులకు ఆర్థిక సమస్య తీరింది. ప్రభుత్వ పథకాలు, చర్యలతో జిల్లాలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది.