నాగర్కర్నూల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశంతో గ్రామాల్లో పలు దఫాలుగా ఈ కార్యక్రమం అమలైంది. ఇందులో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం, పవర్ తదితర సమస్యలను పరిష్కరించారు. గ్రామాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను, మురుగును, ఇండ్ల మధ్యన ఉన్న ముళ్ల పొదలు తొలగించడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లను శిథిలం చేయడం, పాడుబడ్డ బావులను పూడ్చారు. హరితహారంలో భాగంగా ఇండ్లు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. ఇండ్ల మధ్య వేలాడుతున్న వైర్లను సరి చేశారు. ఇలా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దాదాపుగా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా మారాయి. ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా జనాభాను బట్టి నిధులను సైతం మంజూరు చేస్తూ వస్తున్నది.
పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఈ క్రమంలో మళ్లీ జూలై 1 నుంచి పది రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణ ప్రారంభించనున్నది. దీనికిగానూ సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ఇటీవలే జిల్లాలకు నిధులను సైతం మంజూరు చేశారు. తాజాగా కలెక్టర్కు రూ.కోటి, అదనపు కలెక్టర్కు రూ.25లక్షల చొప్పున నిధులను కేటాయించడం గమనార్హం. కాగా జూలైలో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామంలో 12 వేల చొప్పున నర్సరీల్లో మొక్కలను పెంచారు. ఇప్పటికే గోతులను తీసే పని వేగంగా జరుగుతున్నది. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించనున్నారు. అలాగే మురుగు నీరు నిల్వకుండా, చెత్త కుప్పలను తొలగించే పనులు చేపట్టననున్నారు.
బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేపట్టి దోమలు, ఈగలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. గతంలో చేపట్టిన ఇలాంటి కార్యాచరణతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు 90 శాతం వరకు తగ్గాయి. ఒకరోజు పవర్ డేను నిర్వహించి ఇండ్ల మధ్యన వేలాడే విద్యుత్ వైర్లను సరిచేయడం, కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేపడతారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం ఇందులో పాల్గొంటారు. నిరంతరం అమలు చేయనున్న ఈ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా చేయడం, సీజనల్ వ్యాధులను తగ్గించడం, అభివృద్ధిలో భాగం చేయడం జరుగుతుంది. ఇప్పటికే సీఎం ఆదేశాలతో కలెక్టర్, అదనపు కలెక్టర్లు పట్టణ, పల్లె ప్రగతి అమలుకు సంబంధించి మండల, గ్రామస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ శారు. మొత్తం మీద జూలై 1నుంచి ప్రతిష్టాత్మకమైన పల్లె,పట్టణ ప్రగతి పరుగులుపెట్టనున్నది.
ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి..
గ్రామాలు, పట్టణాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణ అమలుచేపడుతున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీనికోసం ప్రభుత్వం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తున్నది.జిల్లాకు ఇటీవలే రూ.93 కోట్లు మంజూరయ్యాయి.
జూలై 1 నుంచి జరిగే పల్లె, పట్టణ ప్రగతిలోఅధికారులతోపాటు ప్రజాప్రతినిధులు భాగం కానున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రభుత్వం చేపడుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో
భాగంగా మన ప్రాంతాలను మనమే బాగు చేసుకోవాలి.