మహబూబ్నగర్ : ధరణి సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ధరణి ప్రజావాణిలో భాగంగా ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీ-సేవ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ధరణి పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 20,172 దరఖాస్తులు రాగా 18,850 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. తాసిల్దార్లు, రెవెన్యూ అధికారుల సహకారంతో ధరణి సమస్యల పరిష్కారానికి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తనతో పాటు ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ, ఆర్డిఓ ప్రతిరోజూ 3, 4 గంటలు ధరణిపై సమీక్ష నిర్వహించి దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణిని రెండు వారాలపాటు నిర్వహించాలని అనుకున్నప్పటికి ప్రజాలనుంది వస్తున్న స్పందన చూసి 6 వారాలకు పెంచామన్నారు. ధరణి కోసం ప్రత్యేక మీసేవ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.