మహబూబ్నగర్ జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణాన్ని బైపాస్ చేస్తూ.. నూతనంగా ఏర్పాటు చేయనున్న జడ్చర్ల-దేవసూగూర్ భారత్మాల హైవే నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ వెంకట్రావును కలిసి సంసిద్ధతను తెలిపారు. ఈ మేరకు శనివారం వినతిపత్రం అందజేశారు. నాలుగేండ్ల కిందట తమ భూముల్లో సర్వే చేపట్టారని.. అప్పటి నుంచి లావాదేవీలపై ఫ్రీజింగ్ పెట్టడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని తెలిపారు. రహదారి నిర్మాణానికి భూములు తీసుకోవడంవల్ల తమకు కొంత నష్టం వాటిల్లుతుందనేది నిజమే అయినా.. మిగ తా భూములకు ఇంకా మంచి విలువ వస్తుందని రైతు లు తెలిపారు. పెద్ద రోడ్లు రావడంవల్ల తమ ఊరు, ఈ ప్రాంతం కూడా బాగుపడుతుందని, సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని వెల్లడించారు. కానీ కొందరు దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో తమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు వాపోయారు. భారత్మాల రోడ్డు నిర్మాణంవల్ల ఎలాంటి నష్టంలేని, ఈ అంశంతో ఏమాత్రం సం బంధంలేని వారు వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. నాలుగేండ్లుగా తాము చాలా నష్టపోయామని, భారత్మాల రోడ్డు కో సం తాము ఇష్టపూర్వకముగా భూములను ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపారు.