ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,888 చెల్లింపు
దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవొద్దు
కరోనా వస్తే ప్రభుత్వ దవాఖానల్లో సేవలు పొందండి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హన్వాడ, ఏప్రిల్ 29 : రైతులు ఆరుగాలం పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని కొనగట్టుపల్లిలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రైతుల నుంచి దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. ఏ-గ్రేడ్ క్వింటాకు ప్రభుత్వం రూ.1,888 ధర చెల్లిస్తున్నదన్నారు. తూకంలో ఎవరైనా మోసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి మండలంలోని ప్రతి చెరువును నింపి మూడు పంటలు పండించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనాపై జాగ్రతగా ఉంటూ మాస్కులు ధరించాలని కోరారు. కరోనా నివారణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. ఎవరూ భయపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, జెడ్పీటీసీ విజయ నిర్మల, సర్పంచ్ మానస, ఎంపీటీసీ పెద్ద చెన్నయ్య, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఏపీఎం సుదర్శన్, తాసిల్దార్ శ్రీనివాసులు, పార్టీ అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు కొండ లక్ష్మయ్య, నరేందర్, బసిరెడ్డి, రామణారెడ్డి, ఖాజాగౌడ్ పాల్గొన్నారు.
ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం
మహబూబ్నగర్, ఏప్రిల్ 29 : ప్రతి ఫిర్యాదునూ పరిగణలోకి తీసుకుంటూ పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలకు అధికారులు చేరువగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తినా అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.
కరోనా వార్డును పరిశీలించిన మంత్రి
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 29: కరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళ చెందొద్దని, అన్నిరకాల వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం రాత్రి మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా పరిశీలించారు. కొవిడ్ హెల్త్కేర్ సెంటర్ వద్ద రోగులకు అందుతున్న వైద్యసేవలు, మందులు, ఆక్సిజన్, టీకాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ వైద్యసేవలపై మంత్రికి తెలిపారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా దేవరకద్ర, కోయిలకొండ, బాలానగర్లో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవరసరమైతే ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట కరోనా నోడల్ అధికారి డాక్టర్ జీవన్, డాక్టర్ కిరణ్ప్రకాశ్, డాక్టర్ శశికాంత్ తదితరులు ఉన్నారు.