మహబూబ్నగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జడ్చర్ల.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కేంద్రస్థానంలో ఉన్న పట్టణం. మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న వేళ అంతా అభివృద్ధిపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలోనే జడ్చర్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మారింది. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత మరింత అభివృద్ధి చెందుతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో జడ్చర్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇటీవలే బాదేపల్లి, కావేరమ్మపేట, జడ్చర్లను కలిపి జడ్చర్ల మున్సిపాలిటీగా మార్చింది ప్రభుత్వం. ఈ నెల 30న జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డితో నమస్తే తెలంగాణ ముఖాముఖి.
జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి?
జడ్చర్ల పట్టణం అభివృద్ధికి చిరునామాగా మారింది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే జడ్చర్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. పదేండ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరుగకపోవడం వల్ల ఏర్పడిన లోటును కొత్త మున్సిపాలిటీ ద్వారా తీరుస్తాం. ఇన్నాళ్లు జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేట వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మూడు పట్టణాలు కలిసి జడ్చర్ల మున్సిపాలిటీగా మారడంతో నిధులు పెద్ద ఎత్తున విడుదలై వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నది. మొదటిసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. చేసిన అభివృద్ధే మా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది. పట్టణ ప్రజలకు అభివృద్ధి సాధకులు ఎవరో.. నిరోధకులుగా ఎవరో స్పష్టంగా తెలుసు. ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపే ఉంటాయని అందరికీ తెలుసు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలను పట్టణవాసులు ఎవరూ నమ్మరు.
జడ్చర్ల పట్టణ అభివృద్ధిలో అప్పటికీ.. ఇప్పటికీ తేడా?
సమైక్య పాలనలో జడ్చర్ల పట్టణం పూర్తిగా నిరాదరణకు గురైంది. వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో మరింతగా అభివృద్ధి చేయాలని భావించి.. రూ.60కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. ఇరుకురోడ్లు, పారిశుధ్య నిర్వహణ లోపం, సేదతీరేందుకు అవకాశాలు లేకపోవడం.. ఇప్పుడు పట్టణంలోని రహదారులన్నింటినీ విస్తరించాం. పట్టణమంతా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజలు సేదతీరేందుకు రెండు మినీ ట్యాంక్బండ్లు, సుమారు 20పార్కులు ఏర్పాటు చేశాం. పురాతన రంగనాయక గుట్ట మీదికి చేరుకునేందుకు సీసీరోడ్డు ఏర్పాటు చేశాం. గుట్టపైన ఏడెకరాల విశాల స్థలంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జడ్చర్ల పట్టణంలోని నాగసాలలో 77 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ఒకప్పుడు తాగునీటికి కటకట ఎదుర్కొన్న జడ్చర్ల పట్టణంలో ప్రస్తుతం రెండు రోజులకోసారి మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నది. రెండు నెలల్లో కొత్తగా నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చి ప్రతిఇంటికీ నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నాం.
ఉమ్మడి జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్లలో చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటీ?
పట్టణంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. పట్టణంలో 1,500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో 60శాతం మేర నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరగా నిర్మాణం చేపట్టి అర్హులైన వారికి అందజేస్తున్నాం. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. రూ.20కోట్లతో 100 పడకల దవాఖాన పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా దవాఖాన నిర్మాణం పూర్తిచేసి ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.
పట్టణం విస్తరిస్తోంది.. స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారా..?
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ ద్వారా ఇప్పటికే వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. చిరు వ్యాపారాలు, కిరాణా, సూపర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, ఇంటి అద్దెలు ఇలా అనేక రంగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించాయి. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి మధ్యలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల సమీపంలో భవిష్యత్లో ఇంకా అనేక పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. జడ్చర్ల సమీపంలోని దివిటిపల్లి ఐటీ పార్కు ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. సాధ్యమైనంతవరకు భారీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింతగా పెంచుతాం.
జడ్చర్ల నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి?
జడ్చర్ల పట్టణం మీదుగా కాశీ నుంచి కన్యాకుమారికి వెళ్లే ఎన్హెచ్ 44 జాతీయ రహదారి వల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. భవిష్యత్లో హైదరాబాద్- బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేగా మారే అవకాశం ఉన్నందున జడ్చర్ల మరింత కీలకంగా మారనున్నది. దీంతోపాటు హగరి(బళ్లారి) నుంచి కోదాడ వరకు ఉన్న ఎన్హెచ్-167 వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు రవాణా సదుపాయాలు భారీగా పెరిగాయి. ఈ రెండు జాతీయ రహదారులను విస్తరించడం వల్ల జడ్చర్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అనేక వ్యాపార సంస్థలకు కేంద్రంగా మారింది. ఈ రెండు జాతీయ రహదారులతోపాటు సమీపంలోనే (68కి.మీ దూరంలో) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో గంటలో అక్కడికి చేరుకొని దేశ విదేశాలకు ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడింది. జడ్చర్ల రైల్వేస్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైలు సదుపాయం కూడా ఉంది. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఎంతో అనువైన జడ్చర్లలో పరిశ్రమల ఏర్పాటు సైతం వేగంగా జరుగుతున్నది. వీటన్నింటి కారణంగా భవిష్యత్లో ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న పట్టణంగా జడ్చర్ల పేరుపొందింది. అందుకే రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న పట్టణంగా జడ్చర్ల మారింది.