సూపర్ స్ప్రెడర్లందరికీ టీకా వేయాలి: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎల్లూరు వద్ద మోటర్ల మరమ్మతు దృష్ట్యా తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి వీసీ
మహబూబ్నగర్, మే 27 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ శుక్రవారం, శనివారాల్లో నూటికి నూరుశాతం సూపర్స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ అందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఇటీవలే 150 మంది హౌస్ సర్జన్లను నియమించుకున్నట్లు తెలిపారు. ఎల్లూరు రిజర్వాయర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకుగానూ ముందస్తుగా పక్కాగా చర్యలు తీసుకుంటూ ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కోయిల్సాగర్ నుంచి మహబూబ్నగర్, గ్రామాలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కరోనా రోగులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. మహబూబ్నగర్ కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి పలు అంశాలపై చర్చించారు. వీసీకి అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.