గద్వాల, జూన్ 27 : అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఆంధ్రా పాలకులను పాతరేస్తామని, మీ గూండాగిరి నడవనివ్వమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హెచ్చరించారు. అందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు మాది ప్రత్యేక రాష్ట్రం.. మా హక్కులకు విరుద్ధంగా కృష్ణాబేసిన్లో దోసెడు నీళ్లు తీసుకోనివ్వమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలిది సైంధవ పాత్ర అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదవులు అనువభవించిన వారే ప్రస్తుతం విమర్శిస్తున్నారని చెప్పారు. సమైక్యపాలనలో ఆంధ్రా జలదోపిడీకి మద్దతుగా హారతి పట్టినో ళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందిందని హాహాకారాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనే నదీజలాలు, సాగునీటి హక్కుల కోసం అని తెలిపారు. కృష్ణా జలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర పభుత్వం చోద్యం చూస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా మీరు ఉన్నారని పాలితులుగా తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. అప్పుడు మీ నాయకత్వం పదవుల కోసం బానిసలుగా మారడంతో ఆంధ్ర పాలకులు అక్రమ ప్రాజెక్టు కట్టగలిగారన్నారు. నీటి కేటాయింపులు జరిగాక, అన్నిరకాల అనుమతులు వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామని చెప్పిన ఆంధ్రపాలకులు ప్రస్తుతం అవేవి పట్టించుకోకుండా రాజ్యాంగ వ్యవతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అందుకు ఉదాహారణ ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కృష్ణాజలాల్లో తెలంగాణ, ఆంధ్రా నీటి వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. కృష్ణాపరీవాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టులు, ఆర్డీఎస్ నీటి వాటా తరలించుక పోతే చూస్తూ ఊరుకోమని ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించారు.