మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్24: పోలీసు శాఖకు అనుబంధంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల పరిశోధనలకు తోడ్పడే పోలీసు జాగిలాల సేవలు ఎంతో గొప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు జాగిలం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని విశ్రాంతి పొందుతున్న సందర్భంగా జాగిలం మున్నాను గురువారం పోలీస్హెడ్ క్వాటర్లో ఎస్పీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ట్రాకర్ విభాగంలో సేవలు అందించిన జాగిలం మున్న పోలీసుల శాఖలో 10ఏళ్ల పాటు చక్కటి సేవలు అందించిందని గుర్తుచేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో సహా నేటికి 300లకు పైగా నేరాలకు సంబంధించిన దర్యాప్తులో మున్న క్లూ అందించడం అభినందనీయమని, అందులో హత్య కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పోలీస్ డ్యూటీలోనూ మున్న రాష్ట్రస్థాయిలో 4 బంగారు పతకాలు సాధించడం, రెండు సార్లు జాతీయస్థాయిలో ప్రాతినిద్యం వహించి ప్రతిభ కనబరిచిందన్నారు. కార్యక్రమంలో హెడ్క్వాటర్స్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీనివాస్, అప్పలనాయుడు, డాగ్ స్కాడ్ సభ్యులు వెంకటేశ్ సిబ్బంది పాల్గొన్నారు.