మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుత వానకాలంలో జూరాలకు వరద అత్యంత ఆశాజనకంగా కొనసాగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూరాల ప్రాజెక్టుకు జూన్ రెండో వారంలోనే వరద వచ్చింది. దీంతో జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు ప్రాజెక్టు పరిధిలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీటిని లిఫ్టు చేయడం ప్రారంభించారు. అలాగే జూరాల కుడి, ఎడమ కాలువలకు సైతం నీటి విడుదల షురూ అయ్యింది. నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మత్తుల కారణంగా నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. సుమారు వారంరోజులపాటు నారాయణపూర్ నుంచి జూరాలకు ఇన్ఫ్లో కొనసాగింది. ఆ తర్వాత కూడా నదీపరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంతో జూరాలకు నిరంతరాయంగా వరద వస్తూనే ఉంది. దీంతో జూరాలపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులకు నీటి విడుదల కొనసాగుతున్నది. తాజాగా బుధవారం మధ్యాహ్నం నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో 8 గేట్లు తెరిచి, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం 42940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 6గంటలకు ఆల్మట్టి డ్యాంకు 75,278 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 40వేల క్యూసెక్కులుగా ఉంది.
మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 519.60 మీటర్లు కాగా… బుధవారం సాయంత్రం నాటికి 517.33 మీటర్లకు చేరుకున్నది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలకుగానూ ఇప్పటికే 88.630 టీఎంసీల స్థాయికి ఆల్మట్టి చేరుకుం ది. ఆల్మట్టి నుంచి నారాణపూర్కు భారీగా వరద వచ్చే అవకా శం ఉండటం వల్లే నారాయణపూర్ నుంచి జూరాలకు నీటి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపూర్ నుంచి బుధవారం మధ్యాహ్నం వదిలిన వరద నేటి సాయంత్రానికి జూరాలకు చేరుకునే అవకాశం ఉంద ని జూరా ప్రాజెక్టు ఏఈఈ బీచుపల్లి తెలిపారు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు బుధవారం 2600 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉన్నా ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7651, నెట్టెంపాడుకు 1500, భీమా-1కు 650, జూరాల కుడి కాలువకు 178, ఎడమ కాలువకు 540, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులతో కలిపి మొత్తం 10799 క్యూసెక్కులను దిగువనకు వదులుతున్నారు. జూరాల పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ బుధవారం సాయంత్రానికి 7.188 టీఎంసీలుగా ఉంది. సమైక్య రాష్ట్రంలో జూరాలకు వరద వస్తే కనీసం స్థానిక ప్రాజెక్టులకు వదలకముందే దిగువకు తీసుకుపోయిన సందర్భాలు పాలమూరు రైతులు మర్చిపోలేదు. ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా మన ప్రాజెక్టులకే వినియోగిస్తున్న తీరును చూసి రైతులు సంతోషానికి గురవుతున్నారు. ఇప్పటికే రిజర్వాయర్లు, కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ సీజన్లో కూడా రైతులకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీశైల జలాశయానికి వరద
కృష్ణానది పరీవాహక ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 816.80 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటినిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 31.5168 టీఎంసీల నీటినిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉదయం 6,556 క్యూసెక్కుల నీరు వినియోగించి 2.929 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తూ 6,674 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
టీబీ డ్యాం ఇన్ఫ్లో 21,565 క్యూసెక్కులు
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 21,565 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 254 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1604.60 అడుగులు ఉన్నాయి. సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 25.983 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.