మహబూబ్నగర్, జూన్23: పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్న సందర్భంగా సెలవులు పెట్టకుండా విద్యార్థులకు బోధన చేసేందుకు ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీసీ ద్వారా జిల్లా, మండల విద్యాధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జూలై 1నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకుని అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలో పరిశుభ్రత, మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈఏడాది విద్యాశాఖకు 5లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యాబోధన జరగాలన్నారు. పాఠశాలలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉంచాలని, స్థానిక దాతల నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఏజెన్సీలతో స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఈవో ఉషారాణి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్లు, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎంఈవోలు, ఎంపీవోలు ఉన్నారు.