భర్త చితి కాలకముందే భార్య మృతి
భూత్పూర్, మే 23 : అనారోగ్యంతో భర్త మృతిచెందగా అంతిమ సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి రాగానే, తీవ్ర అస్వస్థతకు గురై భార్య కూడా తనువు చాలించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వెల్కిచర్లలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దేవేందర్ (64) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. భర్త దేవేందర్కు దవాఖానలో సేవలు చేసిన భార్య లక్ష్మమ్మ (57) సైతం శనివారం రాత్రి 10గంటలకు మరణించింది. ఉదయం చనిపోయిన భర్తను సాయం త్రం దహన సంస్కారాలు నిర్వహించి ఇంటికి వచ్చిన బంధువులు, గ్రామస్తులంతా తమ తమ ఇండ్లలోకి వెళ్లిన వెంటనే లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమానురాగా లు ఎంత బలంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.