కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి
పాలమూరులో మెరుగైన వైద్యం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎస్వీఎస్ దవాఖానలో కొవిడ్ వార్డు పరిశీలన
ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం పాలమూరులోని ఎస్వీఎస్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డును సందర్శించి బాధితులకు మనోధైర్యం కల్పించారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 22 : ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలోని కొవిడ్ వార్డును తనిఖీ చేశారు. కొవి డ్ బాధితులతో మంత్రి మాట్లాడి మనోధైర్యం నింపారు. అనంతరం పార్మసీ, సీటీ స్కాన్ ల్యాబ్ను పరిశీలించారు. ఎస్వీఎస్ దవాఖానలో కేవలం రూ. 1999కే సీటీ స్కాన్ చేయడంతోపాటు, రూ.30వేల కంటే తక్కువకే కొవిడ్ రోగులకు వారంరోజులపాటు చికిత్స అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు, ప్రైవేట్ దవాఖానల్లో మందులు, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసి పేదలకు తక్కువ ధరకు చికిత్స అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలతో మాట్లాడి తక్కువ ధరకు చికి త్స అందించాలని కోరగా, ముందుగా ఎస్వీఎస్ వారు ముందుకొచ్చి ఒక కొవిడ్ రోగి రూ.లక్షా 20వేల బిల్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.20వేలు తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ జనరల్ దవాఖానలో అవసరమైన మేరకు డాక్టర్లు, నర్సులను నియమించడంతోపాటు, ఆక్సిజన్ బెడ్లు, మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు వై ద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని సేవల ను పొందవచ్చని తెలిపారు. జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతున్నదని, ఇప్పటివరకు 11వేలమందికి కొవిడ్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఆరు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటితోపాటు సంచార అంబులెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉం టే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ ఫంగస్ కేసు కూడా నమోదు కాలేదని, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల వైద్యులు ఇలాగే కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్వీఎస్ దవాఖాన డైరెక్టర్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.