పాలమూరుకు నర్సింగ్, వనపర్తికి మెడికల్ కళాశాల
గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తిలో రీజినల్ సబ్ సెంటర్లు
మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ కృషి అభినందనీయం
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో ఉమ్మడి జిల్లాలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. వైద్య కళాశాలతోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాలకు రీజినల్ సబ్సెంటర్లు మంజూరు చేశారు. రీజినల్ సబ్సెంటర్ల ఏర్పాటుతో వాటి పరిధిలోని వివిధ ప్రభుత్వ దవాఖానలకు సత్వరం మందులు అందించడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో వైద్య సేవల్లో ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందనున్నది. వైద్య సదుపాయాల కల్పనకు మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. – మహబూబ్నగర్ మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్ మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు ఫుల్స్టాప్ చెబుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం మరింత చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్నగర్లో ప్రారంభమైనది. ప్రస్తుతం ఈ కళాశాల పరిధిలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ద్వారా అధునాతన వైద్య సేవలందుతున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు పెంచుకుంటూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో ఉమ్మడి జిల్లాలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. వైద్య కళాశాలతోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాలకు రీజినల్ సబ్ సెంటర్లు సైతం మంజూరు చేశారు. రీజినల్ సబ్సెంటర్ల ఏర్పాటుతో వాటి పరిధిలోని వివిధ ప్రభుత్వ దవాఖానలకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అవకాశం ఉంది. మరోవైపు మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు నర్సింగ్ కళాశాల మంజూరు చేయడంతో వైద్యంలో ఉమ్మడి జిల్లా మరింతగా అభివృద్ధి చెందనున్నది. ఉమ్మడి జిల్లాలో వైద్య సదుపాయాల కల్పనలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ చేస్తున్న కృషిని ప్రజలు హర్షిస్తున్నారు.
ఇకపై పట్టణాలకు పోనక్కరలేదు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరో మెడికల్ కళాశాల రానున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొంటూ.. రాష్ట్రంలో నూతనంగా ఆరు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఒకటి వనపర్తి జిల్లాకు కేటాయించారు. ఈ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించిన తరుణంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పడనున్నది. వనపర్తిలోనూ మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు పంపించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మహబూబ్నగర్లోని జనరల్ దవాఖాన మహబూబ్నగర్తోపాటు నారాయణపేట జిల్లాల ప్రజలకు.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలోని వారికి కొంతమేర అందుబాటులో ఉంటుంది. వనపర్తి మెడికల్ కళాశాలతోపాటుగా ఏర్పాటు చేసే జనరల్ దవాఖాన వనపర్తి జిల్లాతోపాటు నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోని వారికి వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. అదేవిధంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖాన సూపర్ స్పెషాలిటీ జనరల్ దవాఖానగా మారనున్నది. కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఈఎన్టీ, గైనిక్, అనెస్తేసియా, రేడియాలజీ, జనరల్ సర్జరీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి విభాగాలు అందుబాటులోకి వస్తాయి. అధునాతన ల్యాబ్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకునే దుస్థితి స్థానికులకు తప్పుతుంది. వనపర్తిలో వైద్య కళాశాల మంజూరు చేయించి స్థానికులకు అధునాత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చేసిన వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
పాలమూరుపై ఆధారపడాల్సిన పనిలేదు
ఉమ్మడి జిల్లాలోని జిల్లా, ఏరియా, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ మందులు, ఇతర వైద్య సంబంధ పరికరాలు మహబూబ్నగర్ జనరల్ దవాఖానలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) ద్వారా పంపిణీ అయ్యేవి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ దవాఖాన నుంచి అందరూ మహబూబ్నగర్కు వచ్చి మందులు తీసుకెళ్తున్నారు. దీంతో మందుల తరలింపు ఆలస్యం కావడంతోపాటు వాహనాల ఖర్చు పెరిగిపోతున్నది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిలో మూడింటిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు కేటాయించాలని ఆదేశించారు. ఈ రీజినల్ సబ్సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ దవాఖానలకు మందులు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. మందులు నిల్వచేసేందుకు సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ జిల్లా పరిధిలోని మందులు ఆ జిల్లా కేంద్రంలోని దవాఖానలో ఉంటాయి. అక్కడి నుంచి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు త్వరగా మందులను పంపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
వైద్య సదుపాయాలు మరింత చేరువ..
వనపర్తి జిల్లాలో సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నెరవేరని సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. మంత్రి నిరంజన్రెడ్డి కృషితో వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరైంది. ఈ కళాశాల ఏర్పాటుతో వనపర్తికి వైద్య సదుపాయాలు మరింత చేరువవుతాయి. అత్యవసర వైద్యం కోసం కర్నూలు, పాలమూరు, హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
సంబు రవికుమార్, వనపర్తి
అందుబాటులోకి వస్తాయి
వైద్య కళాశాల ఏర్పాటైతే అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అన్ని స్పెషాలిటీలు చేరువవుతాయి. కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఈఎన్టీ, గైనిక్ తదితర అనేక విభాగాలు అందుబాటులోకి ఉంటాయి. నిష్ణాతులైన వైద్యులు జనరల్ దవాఖానలో సేవలందిస్తారు. రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది.
అల్లె శ్రీనివాసులు, డీఎంహెచ్వో, వనపర్తి జిల్లా