మహబూబ్నగర్ జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానదితో పోలిస్తే భీమానదిలో ఏడాది పొడవునా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భీమా ఎత్తిపోతల పథకానికి ఉన్న 20 టీఎంసీల నీటి కేటాయింపును తాజాగా ప్రతిపాదిస్తున్న భీమా వరద కాల్వ ద్వారా కూడా పొందేందుకు మనకు హక్కుంది. అందుకే ఈ వరద కాల్వపై ఎలాంటి పేచీలు ఉండే అవకాశమే లేదు. దర్జాగా మన నీటిని మనం వాడుకునేందుకు ఈ వరద కాలువే వరప్రదాయిని కానున్నది. అయితే భీమా నదిపై తెలంగాణ- కర్ణాటక సరిహద్దుల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఆయకట్టును మరింతగా పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరదకాల్వ లేదా రిజర్వాయర్ అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశంపై మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసే అవకాశం ఉంది.
కృష్ణాతో సంగమించే ప్రాంతానికి ముందుగా..
భీమానది కృష్ణాకు ఉపనది. మహారాష్ట్రలోని భీమశంకర్ వద్ద పుట్టి తెలంగాణలోని కృష్ణావద్ద కృష్ణానదిలో ఈ ఉపనది కలుస్తుంది. కృష్ణానదిలో కలువడానికి ముందు రెండు నదుల్లో భీమానే పెద్దది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ప్రవహించే భీమానదిలో ఏడాది పొడవునా నీటి లభ్యత అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ స్టేట్లో తంగిడి వద్ద భీమా రిజర్వాయర్ నిర్మించేందుకు సంకల్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో సమైక్య పాలకులు కుట్రపూరితంగా వ్యవహరించి భీమా రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతాన్ని కర్ణాటకలో కలిసేలా చేశారు. దీంతో భీమా రిజర్వాయర్ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే సమైక్య పాలకులు అటకెక్కించారు. తర్వాత రెండు దశల్లో భీమా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని ఎత్తిపోయడం ద్వారా 2,03,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. అయితే జూరాలలో నీటి లభ్యత సరిగా లేకుంటే ఈ ఆయకట్టుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జూరాలపై ఆధారపడి జూరాల ఆయకట్టు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మిషన్భగీరథ ఉన్నాయి. వీటన్నింటికి సుమారు 5.7 టీఎంసీల వరకు నీరు అవసరమవుతున్నది. జూరాలలో పూర్తి నీటినిల్వ సామర్థ్యం కూడా 11టీఎంసీలు అయితే 6 నుంచి 7టీఎంసీల నీటిని నిల్వచేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు పంపుల నిర్వహణ, విద్యుత్ ఖర్చులు సైతం భారీగా ఉంటున్నాయి. ఈ తరుణంలో భీమా వరద కాల్వను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో భీమానది నుంచి వరద కాల్వను తవ్వుతూ కృష్ణానదికి సమాంతరంగా తీసుకువచ్చి సరళాసాగర్ రిజర్వాయర్ను నింపనున్నారు. సరళాసాగర్ వరకు వచ్చే క్రమంలో మధ్యలో అవకాశాన్ని బట్టి సుమారు 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆరేడు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ పరిధిలోనే నిర్మిస్తున్న వరద కాల్వ కావడం వల్ల అంతర్రాష్ట్ర నీటి సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉండబోదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆలంపూర్ పాదయాత్ర సందర్భంగా సీఎం కేసీఆర్ భీమా ఆయకట్టుకు సైతం గ్రావిటీ ద్వారా నీరందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సజీవ భీమానది మన తలాపునే ప్రవహిస్తున్నా.. 50, 60ఏండ్లు తాగు, సాగునీటికి గోస పడాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని నిపుణులు అంటున్నారు. భీమా వరద కాల్వ వల్ల మరో జూరాలను ఏర్పాటు చేసుకున్నట్లే అని చెబుతున్నారు.
ఇవీ ప్రతిపాదనలు..
భీమానది ద్వారా తెలంగాణ సరిహద్దు నుంచి వరద కాల్వ ద్వారా వివిధ దశల్లో సరళాసాగర్కు తరలించి అక్కడినుంచి ప్రస్తుత భీమా ఆయకట్టుకు 1.30లక్షల ఎకరాలకు సాగునీరు వినియోగించుకోవచ్చు.కృష్ణా మండలం తంగిడి సమీపంలో తెలంగాణ- కర్ణాటక మధ్యన భీమా రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రయత్నించడం. తంగిడి వద్ద వాటర్ లెవల్ 338 మీటర్లు కాగా జూరాల లెవల్ 315మీటర్లు. అంటే ఇక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే నేరుగా జూరాలకు సైతం నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. రిజర్వాయర్ వల్ల కర్ణాటకలోనూ ముంపు పెద్దగా ఉండబోదు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఆయకట్టు పెరుగుతుంది.