కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయొద్దు
ఆరు రోజులకు మందులతో కలిపి రూ.30వేలు..
ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60వేల ఫీజు నిర్ణయం
జిల్లాలో వందశాతంవ్యాక్సినేషన్కు కృషి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలతో సమావేశం
మహబూబ్నగర్/టౌన్, మే 21 : ప్రైవేట్ దవాఖాన ల్లో పేదలకు వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రైవేట్ వైద్యశాలల యాజమాన్యాలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20శాతం బెడ్లను పేద కరోనా బాధితులకు ఉచితంగా అందజేయాలని, లేనిపక్షంలో నామమాత్రపు ఫీజుతో వైద్యం అందించాలని సూచించారు. సీటీ స్కానింగ్కు రూ.1999 తీసుకోవాలన్నారు. రెండు, మూడు దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది సరైన విధానం కాదన్నారు.
ప్రాథమిక రక్త పరీక్షల, మందులు కలిపి ఆరు రోజుల వైద్యం కోసం ఆక్సిజన్ లేకుండా రూ.30వేలు, ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60వేల ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, జిల్లా జనరల్ దవాఖానలో ఇప్పటికే 261 ఆక్సిజన్ పడకలు ఉండగా, మరో 250 పడకలను ఆక్సిజన్ సౌకర్యంతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 10,100 కిట్లను అందజేసినట్లు తెలిపారు. అలాగే సుమారు 92వేల మందికి కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చామన్నారు. జిల్లాలో 100శాతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు ఉన్నారు.
మార్కెట్లను శుభ్రంగా ఉంచాలి
నిత్యం రద్దీగా ఉండే రైతుబజార్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశా రు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో నిర్మిస్తున్న రైతుబజార్ నిర్మాణ పనులు, రామయ్యబౌళి వద్ద మోడ ల్ రైతుబజార్, టీడీ గుట్ట వద్ద రైతుబజార్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్టుగడ్డ వద్ద నూతనం గా నిర్మిస్తున్న మోడల్ రైతుబజార్ను అన్ని హంగులతో శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ రూరల్ మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన నర్సింహులుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. వేపూరిగేరిలోని లోకల్ న్యూస్ రిపోర్టర్ జయాకర్, జబర్దస్త్ ఫేమ్ సునామి సుధాకర్ తల్లి వెంకటమ్మ అనారోగ్య సమస్యలతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం వారి స్వగృహానికి వెళ్లి పార్థ్థివదేహం వద్ద నివాళులర్పించారు.